పత్తి విత్తన వ్యాపారానికి అడ్డా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. దేశంలో ఉత్పత్తి అయ్యే పత్తి విత్తనాల్లో దాదాపు 60శాతానికి పైగా జోగులాంబ గద్వాల జిల్లాలోనే ఉత్పత్తి అవుతాయి. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్లో విత్తన తయారీ కంపెనీలున్నాయి. అందుకే పత్తి విత్తన వ్యాపారానికి పాలమూరు జిల్లా అడ్డాగా మారింది. కాగా నకిలీ, నాసిరకం, కాలం చెల్లిన, విఫలమైన, అనుమతి లేని విత్తనాల అక్రమ వ్యాపారానికి సైతం పాలమూరు జిల్లానే అడ్డాగా మారుతోంది.
దాడుల్లో క్వింటాళ్ల కొద్దీ విత్తనాలు
ఉమ్మడి జిల్లాలో ఏదోచోట అమ్మేందుకు వీలులేని విత్తనాలు పట్టుబడుతూనే ఉన్నాయి. ఇటీవల గద్వాల పట్టణంలో 20 క్వింటాళ్ల విఫలమైన విత్తనాలు పట్టుబడ్డాయి. అయిజలో 2 క్వింటాళ్లు, మల్దకల్ మండలంలో 30 క్వింటాళ్లు టాస్క్ఫోర్స్ దాడుల్లో దొరికాయి. గతేడాది జోగులాంబ గద్వాల జిల్లాలో అక్రమ పత్తి విత్తనాలపై సుమారు 38 కేసులు నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలోనూ గత సంవత్సరం ఆరున్నర లక్షల రూపాయస విలువజేసే నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోనూ అనుమతి లేని విత్తనాలు నిల్వ ఉంచిన వ్యాపారులపై కేసులు నమోదయ్యాయి.
రెండూ అక్కడే
జోగులాంబ గద్వాల జిల్లాలో సుమారు 40వేల ఎకరాల్లో పత్తివిత్తనాలు సాగవుతున్నాయి. పండించిన విత్తనాలను రైతులు కంపెనీలకు అప్పగిస్తారు. నాణ్యమైన విత్తనాలను కంపెనీ తీసుకుని విఫలమైన విత్తనాలను తిరిగి రైతులకు అప్పగించాలి. డిసెంబర్, జనవరిల్లో రైతులు విత్తనాలు అప్పగిస్తే మార్చి, ఏప్రిల్ కల్లా విఫలమైన విత్తనాలను తిరిగి రైతులకు అప్పగించాలి. కానీ విఫలమైన విత్తనాలను విక్రయిస్తున్నార్న ఆరోపణలతో పత్తి సీజన్ ముగిశాక వాటిని కంపెనీలు, ఆర్గజైనర్లకు, రైతులకు అప్పగిస్తున్నాయి. అలా అప్పగించిన విఫల విత్తనాలను పశువుల దాణాగా ఉపయోగించాలి. కానీ కొందరు అక్రమార్కులు విఫలమైన విత్తనాలను తక్కువ ధరకు తిరిగి రైతులకు అమ్ముతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇటీవలి దాడుల్లో విఫలమైన విత్తనాలు పట్టబడటమే ఆ ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. దీని ద్వారా జిల్లాలో కోట్ల రూపాయల వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. విఫలమైన విత్తనాలను పనికిరాకుండా చేయడంలో కంపెనీలు, ఆర్గనైజర్ల నిర్లక్ష్యమే అక్రమార్కులకు వరంగా మారుతోంది. దీనిపై వ్యవసాయశాఖ అధికారుల పర్యవేక్షణ మరింత పెంచాల్సిన అవసరం ఉంది.
చర్యలు తప్పవు
మరోవైపు నకిలీ విత్తన వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లోనూ టాస్క్ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. పలుచోట్ల తనిఖీలు, ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నాయి. పట్టుబడిన విత్తనాలకు సంబంధించి సరైన ఆధారాలు, పత్రాలు, ధ్రువీకరణలు చూపిస్తే సరేసరి. లేదంటే ఊచలు లెక్కబెట్టక తప్పదని ఎస్పీ రంజన్ రతన్ కుమార్ హెచ్చరించారు. మిగిలిన జిల్లాల ఎస్పీలు సైతం ప్రకటనలు విడుదల చేశారు.
ఈసారైనా
ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్రమ పత్తి విత్తనాలను రైతులకు అంటగట్టేందుకు దళారులు గ్రామాల్లో పాగా వేయనున్నారు. అక్రమ విత్తనాలను నిల్వ చేసే ప్రయత్నాలు సైతం ఈ సమయంలోనే మొదలవుతాయి. ఆదిలోనే ఉక్కుపాదం మోపితే నకిలీ విత్తనాల బారి నుంచి రక్షించిన వారవుతారని ప్రభుత్వాన్ని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి: covid effect: ఉపాధి కరవై పట్టెడన్నం కోసం సినీకార్మికుల పాట్లు