ఏపీలోని గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెంలో వైకాపా నేతలు తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారని మౌలాలి అనే దివ్యాంగ వాలంటీర్ ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఆరో వార్డు నుంచి తన తల్లిని పోటీ చేయించమంటే నిరాకరించినందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపించారు.
తండ్రి నాగేశ్వరరావుతో కలిసి మౌలాలి.. విలేకర్లతో శుక్రవారం మాట్లాడారు. 'వైకాపా నేతలు తాండ్ర సాంబశివరావు, సూరినేని మురళీకృష్ణ, కుంటా రత్నబాబు, సూరయ్య, మాడా శ్రీనివాసరావు.. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతుతో మా అమ్మను ఎన్నికల్లో పోటీ చేయించాలని అడిగారని తెలిపాడు.
అంతు చూస్తామంటూ..
పొలం పనులు చేసుకుని బతికే మాకు రాజకీయాలు వద్దని చెప్పడంతో.. మేం అడిగితే ఎన్నికల్లో పోటీ చేయబోమంటావా? నిన్ను వాలంటీర్ ఉద్యోగం నుంచి తప్పించి అంతు చూస్తామంటూ వైకాపా నేతలు బెదిరించారని ఆవేదన చెందాడు. దౌర్జన్యం చేసి, నా అంగ వైకల్యంపై దుర్భాషలాడారని, గ్రామంలో లేకుండా చేస్తామనటంతో భయపడి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపాడు. ఇంతలో మా నాన్న వచ్చి అడ్డుకున్నారుని వాపోయాడు.
తప్పుకోమంటూ బెదిరింపులు..
నల్లమోతువారిపాలెం పంచాయతీ ఎన్నికల్లో నాలుగో వార్డు నుంచి తెదేపా మద్దతుతో పోటీ చేస్తున్న తనను బరిలో నుంచి తప్పుకోవాలంటూ వైకాపా నేతలు తీవ్రస్థాయిలో బెదిరిస్తున్నారని బాపట్ల పద్మ అనే మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. పోటీ నుంచి వైదొలగకుంటే తన భర్తపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని భయపెడుతున్నారని వాపోయింది.
కర్లపాలెం ఎస్సై అంజయ్యను 'ఈటీవీ భారత్' సంప్రదించగా దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. సిబ్బందితో వెళ్లి గ్రామాన్ని పరిశీలించి వచ్చానని తెలిపారు.
ఇదీ చదవండి: బీఆర్కే భవన్ వద్ద టీపీయూఎస్ ఆందోళన