భారతమాతకు మహా హారతి కార్యక్రమాన్ని కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని గత నాలుగేళ్లుగా నిర్వహిస్తున్నామన్నారు. ఈసారి విద్యార్థినుల భారత మాత వేషధారణతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయన్నారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద భారతమాతకు మహా హారతి ఏర్పాట్లను కిషన్ రెడ్డి పర్యవేక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
భారత మాతకు సప్త హారతుల కార్యక్రమంలో స్వామి పరిపూర్ణానంద, సిరివెన్నెల, నాగఫణి శర్మలతో పాటు మేధావులు, విద్యావేత్తలు పాల్గొంటారని తెలిపారు. అంబేడ్కర్ స్ఫూర్తితో నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్దామని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిరంతరం సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న భారత సైనికులకు సెల్యూట్ చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: జెండా పండుగకు ముస్తాబు చేసిన ప్రాంగణాలు