ఈ నెల 11న హైదరాబాద్ హిమాయత్నగర్లోని కుల్దీప్ వైన్షాప్లో చోరీకి పాల్పడ్డ దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం దుకాణం వెనుకవైపు గోడకు కన్నంవేసి చోరీకి పాల్పడ్డ దొంగలు కౌంటర్ లాకర్లో ఉన్న రూ.18లక్షల నగదును ఎత్తుకెళ్లారు. షాపు యజమాని మన్మీత్ సింగ్ బగ్గా ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేపట్టారు. మద్యం దుకాణం భవనం వాచ్మెన్ పరమ్ దమాయి కుమారుడు మన్రాజ్ దమాయిని పక్కా ఆధారాలతో పట్టుకున్నారు.
సీసీటీవీలో రికార్డ్ ...
చోరీ జరిగిన తర్వాత దుకాణం వెనుక ఉన్న వాచ్మెన్ గది ఖాళీగా కనిపించగా.. పోలీసుల అనుమానాలు మరింత బలపడ్డాయి. వీరు నేపాలీకి చెందిన వారు కావడం వల్ల స్థానికంగా నివసించే ఇతర నేపాలీల ద్వారా బేగంబజార్ గుజరాత్ గల్లీలో నివాసముంటున్న వాచ్మెన్ ఆచూకీ కనుగొన్నారు . పరమ్ దమాయితో పాటు అతని కుమారుడు మన్రాజ్ని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. చోరీలో మన్రాజ్తో పాటు మరో ఆరుగురికి హస్తం ఉందని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకోగా... మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
చోరీకి ముందు మూడురోజుల బ్యాంకుల సెలవు....
వైన్షాప్ పక్కనే వాచ్మెన్ గది ఉండటం మన్రాజ్కి చోరీ ప్రణాళిక వేసేందుకు మంచి స్థలం దొరికింది. మద్యం దుకాణం వ్యాపారంపై తన తండ్రికి ఉన్న అవగాహనతో వివరాలన్ని సేకరించాడు. దుకాణంలో పనిచేసే వారి దగ్గరి బంధువు ద్వారా లాకర్ ఎక్కడ ఉంటుంది.. కౌంటర్లో వచ్చే సొమ్ము ఎక్కడ భద్రపరుస్తారు.. లాంటి వివరాలు సేకరించాడు. చోరీకి ముందు మూడు రోజులు బ్యాంకులకు సెలవు ఉండటం వల్ల డబ్బు పెద్దమొత్తంలో ఉంటుందని నిర్దారించుకున్నాడు మన్రాజ్. స్నేహితులు రామ్ ప్రసాద్ అలియాస్ రోషన్ బండారీ, లోకేష్ గోపీ శర్మలతో కలిసి చోరీ పథకం రూపొందించాడు. పథకం ప్రకారం తెచ్చుకున్న డ్రిల్లింగ్ మిషన్తో షాపు వెనుక భాగం నుండి రంధ్రం చేసి లోపలికి ప్రవేశించారు. లాకర్ను వాచ్మెన్ గదిలోకి తీసుకువచ్చి.. బద్దలు కొట్టి అందులో ఉన్న రూ.18లక్షల 30వేల నగదును తీసుకుని అందరూ పంచుకుని అక్కడి నుండి పరారయ్యారు.
తండ్రిని ఇంటికి పంపించాడు...
చోరీకి రెండు రోజుల ముందే మాన్రాజ్ తన తండ్రి వాచ్మెన్ పరమే దమాయిని అక్కడి నుండి ఖాళీ చేయించి బేగంబజార్లోని ఇంటికి పంపించాడు. ప్రధాన సూత్రదారి మాన్రాజ్ దమాయితో పాటు అతని తండ్రి పరమే దమాయి, లోకేష్ గోపీశర్మ , కృష్ణ పరియార్, గౌరీ ఆజయ్ అహూజాలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.7,96,200 నగదు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ భిక్షంరెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులు రామ్ ప్రసాద్ భండారీ, దీపక్ ఖత్రీలు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఇదివరకు ఇలాగే...
ఎంతో నమ్మకంగా వాచ్మెన్లుగా పని చేస్తుండే నేపాలీలు ఈ మధ్యకాలంలో తిన్నింటికే కన్నాలు వేస్తున్నారు. గత ఏడాది ఇదే డివిజన్ పరిధిలో ఓ వ్యాపారి ఇంట్లో వాచ్మెన్గా పనిచేస్తుండే ఓ నేపాలీ కుటుంబం కోటికి పైగా డబ్బులు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. ఏడాది గడిచిన ఇప్పటికి ఆ కేసులో పురోగతి చోటు చేసుకోలేదు. దేశం సరిహద్దులు దాటితే వారిని పట్టుకోలేక పోలీసులు చేతులెత్తేస్తున్నారు.
ఇదీ చూడండి : లైకుల కోసం తుపాకీ.. పోలీసుల అదుపులో యువకులు