తెలంగాణ ఆర్టీసీ అప్పు తీసుకుంటోంది... ఆస్తుల్ని తాకట్టు పెట్టి మరీ అప్పు చేస్తోందంటే మీరు నమ్ముతారా..! ఆదాయానికి, ఖర్చులకు మధ్య పొంతన కుదరకపోవడం, రాయితీ బకాయిల్ని ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల.. సంస్థ పరిస్థితి క్రమంగా అప్పులపైనే ఆధారపడే స్థితికి చేరింది. డీజిల్ ధరలు గుదిబండలా మారడం రోజు వారీ కార్యకలాపాలకు సైతం రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆర్టీసీ సంస్థకు చెందిన ఆస్తుల్ని తాకట్టు పెడుతోంది.
సమాచార హక్కు చట్టం ఏం చెబుతోంది..?
సమాచార హక్కు చట్టం కింద ఆర్టీసీ అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జూన్ వరకు ఆర్టీసీకి రూ.2,445 కోట్ల అప్పులున్నాయి. ఇందులో రూ.1,595 కోట్లను బ్యాంకుల నుంచి నేరుగా తీసుకుంది. ప్రభుత్వ పూచీకత్తుతో మరో రూ.850 కోట్ల రుణం పొందింది.
అప్పులిచ్చేందుకు ఆసక్తి చూపని బ్యాంకులు
ఇవికాకుండా కార్మికుల పీఎఫ్, సహకార పరపతి సంఘానికి చెల్లించాల్సిన బకాయిలు మరో రూ.1,400 కోట్ల వరకున్నాయి. వాటి నుంచి బయట పడడం కోసం మరోమారు రూ.750 కోట్లు అప్పు చేసేందుకు ఆర్టీసీ అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. అయితే ఆర్టీసీకి అప్పులిచ్చేందుకు బ్యాంకులు అంతగా ఆసక్తి చూపటం లేదు.
వడ్డీల రూపంలో ఆర్టీసీ చెల్లింపులు
- వడ్డీల రూపంలో ఆర్టీసీ చెల్లిస్తున్న మొత్తం ఎంతో వింటే ఆశ్చర్యం కలగకమానదు! రూ.2455 కోట్ల అప్పులపై రోజుకు సుమారు రూ.80 లక్షలు వడ్డీ రూపంలో చెల్లిస్తోంది. ఇది ఏడాదికి కాస్త అటు ఇటుగా దాదాపు రూ.250 కోట్లు.
- ప్రభుత్వం రాయితీల కింద చెల్లించాల్సిన మొత్తం సుమారు రూ.700 కోట్ల వరకు ఉంటుంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకదఫా ఇచ్చినా వడ్డీ భారం కొంత తగ్గేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
- ప్రభుత్వం క్రమానుగతంగా కేవలం రాయితీ మొత్తాన్ని చెల్లించినా ఏడాదికి వడ్డీ రూపంలో రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు ఆదా అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.