రాష్ట్రంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి టీవీల ద్వారా 3-10 తరగతుల విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు పాఠాలు ప్రారంభించిన ప్రభుత్వం.. సంబంధిత మార్గదర్శకాలను నేటికీ ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రోజూ 50% మంది ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లాలి. ఆరోజు మిగిలిన వారు ఇళ్ల నుంచే పనిచేయాలి.. అంతవరకు బాగానే ఉన్నా బ్రిడ్జి కోర్సుకు సంబంధించి ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఎలా ఉండాలి? క్షేత్రస్థాయి నుంచి ఎలాంటి సమాచారం సేకరించాలి? ఒక్కొక్కరు ఎంత మంది విద్యార్థులను పర్యవేక్షించాలి? ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవో, డీఈవోలు ఏం చేయాలి?..వంటి అంశాలపై మార్గదర్శకాలు ఇవ్వాలి.
వాటికి సంబంధించి పాఠశాలవిద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాస్తవానికి టీవీ పాఠాలు ప్రారంభానికి వారం ముందే మార్గదర్శకాలు ఇస్తే తదనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవచ్చు. ప్రసారాలు ప్రారంభమై మూడు రోజులు గడిచినా ప్రతిపాదనలకు ఆమోదం లభించకపోవడం! పూర్తిస్థాయి మార్గదర్శకాలు ఉంటేనే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉండని పరిస్థితి. ఇక అసలవి లేకుంటే బ్రిడ్జి కోర్సు లక్ష్యం దెబ్బతినదా..అని ప్రధానోపాధ్యాయుడు ఒకరు వ్యాఖ్యానించారు. అధికారుల లెక్కల ప్రకారమే 68% మంది టీవీ పాఠాలు చూస్తున్నారు. వందశాతం చూసేలా ఏం చేయాలన్న ప్రణాళిక ఉండాలి కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చూడండి: Dead Bodies : చెరువులో ముగ్గురు బాలికల మృతదేహాలు లభ్యం