ఏపీలోని.. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతంలో వైకాపా నేతలు అక్రమ బాక్సైట్ మైనింగ్కు పాల్పడుతున్నారని తెలుగుదేశం నేతలు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండాకు ఫిర్యాదు చేశారు. లేటరైట్ తవ్వకాల పేరుతో ప్రభుత్వం వారికి అనుమతులిచ్చి సహకరిస్తోందని.. ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి, మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి లేఖ రాశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మైనింగ్ను నిషేధిస్తూ 1997లో సమతా కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా.. దానికి విరుద్ధంగా సర్కారు వ్యవహరిస్తోందని లేఖలో పేర్కొన్నారు. లేటరైట్ అనుమతులను అడ్డం పెట్టుకుని..బాక్సైట్ను తవ్వుతూ గిరిజనుల జీవనోపాధిని కూలదోస్తున్నారని మండిపడ్డారు. అక్రమార్కులకు సాయంగా రక్షిత అటవీ ప్రాంతంలో ప్రభుత్వం రోడ్డును వేసిందన్నారు. దీనిపై విచారణ జరిపి ..కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
- ఇదీ చదవండి : దేశద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
మన్యాన్ని చెరబట్టారు..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన బంధువుల కోసం పచ్చని విశాఖ మన్యాన్ని చెరబట్టారని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా భమిడి పంచాయతీలో అక్రమంగా బాక్సైట్ను తవ్వేస్తున్నారని ధ్వజమెత్తారు. పరిశీలనకు వెళ్లిన తెలుగుదేశం బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారని విమర్శించారు. లక్ష్మణరావు అనే వ్యక్తి గతంలో మైనింగ్ కోసం దరఖాస్తు చేస్తే ..తెదేపా ప్రభుత్వం దాన్ని తిరస్కరించిందని గుర్తు చేశారు. నేడు అదే వ్యక్తికి జగన్ సర్కారు ఎలా అనుమతిచ్చిందని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్తో చాలా మంది గిరిజనులు భూములు, జీడి తోటలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైకాపా సర్కార్ దోపిడీకి పాల్పడుతుంది..
విశాఖ జిల్లా నాతవరంలో 121 హెక్టార్లలో మైనింగ్ లీజులు కేటాయించారని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిరాం మండిపడ్డారు. కేంద్రం నిబంధనలు విస్మరించిని ఎలా కేటాయించారో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం సహజ వనరులను కొల్లగొడుతూ దోపిడీకి పాల్పడుతుందని మండిపడ్డ తెలుగుదేశం నేతలు..బెదిరింపులకు భయపడకండా అక్రమాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని తేల్చి చెప్పారు.