ఐటీ సేవలందించే సాఫ్ట్వేర్ కంపెనీలు ఈసారి ప్రాంగణ నియామకాలు తగ్గిస్తున్నాయి. ఇంజినీరింగ్ కళాశాలల ప్రాంగణ నియామక అధికారుల అంచనా ప్రకారం.. అది కనీసం 20-30 శాతం వరకు ఉండొచ్చు. కొన్ని పరిశ్రమలు ఎంపికలు గణనీయంగా తగ్గించాయని వారు స్పష్టంచేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉత్పత్తి తరహా పరిశ్రమలు మాత్రం గతంలో మాదిరే నియామకాలు చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు గత ఏడాది కంటే కాస్త మెరుగ్గా కొలువులు ఇస్తుండటం విశేషం.
ఈసారి కరోనా కారణంగా రాత పరీక్ష, ఇంటర్వ్యూ ప్రక్రియ అంతా ఆన్లైన్ విధానంలోనే కొనసాగిస్తున్నాయి. ఏటా రాష్ట్రం నుంచి దాదాపు 30వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాంగణ నియామకాలకు ఎంపికవుతున్నారని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) గణాంకాలు చెబుతున్నాయి. ఈసారి ఆ సంఖ్య 20వేలకు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.
ఫలితాల కోసం ఎదురుచూపులు
ఈసారి నియామకాలకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ అంతా ఆన్లైన్లోనే జరుపుతున్నందున ఫలితాల వెల్లడి ఆలస్యం అవుతోందని ప్రాంగణ నియామకాల అధికారులు చెబుతున్నారు. టీసీఎస్ నింజా ఫలితాల కోసం వేలమంది ఎదురుచూస్తున్నారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా దాదాపు 40వేల మందిని ఎంపిక చేసుకుంటుంది. కాగ్నిజెంట్ కూడా ఈసారి ఆన్లైన్ పరీక్షలు నిర్వహించింది. ఫలితాలు వెలువడాల్సి ఉంది. క్యాప్ జెమినీ సైతం కళాశాలలకు వెళ్లకుండా విద్యార్థులందరికీ కలిపి ఆన్లైన్ పరీక్ష జరిపింది. నెలాఖరు వరకు ప్రాంగణ నియామకాలపై మరింత స్పష్టత వస్తుందని కళాశాలల ప్రతినిధులు చెబుతున్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి వరకు అవి కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ప్రాంగణ నియామకాలపై మార్గదర్శకం కోసం మెంటార్గా ఆయా సంస్థలను నియమించుకున్న కళాశాలల్లో పరిస్థితులు ఎలా ఉన్నా ఎంపికయ్యే వారి సంఖ్య తగ్గడం లేదని ప్రాంగణ నియామకాలపై శిక్షణ ఇచ్చే సన్టెక్ కార్ఫ్ సంస్థ సీఈవో వెంకట్ కాంచనపల్లి చెప్పారు. విద్యార్థులు బీటెక్ మూడో సంవత్సరం నుంచి బయోడేటాను మెరుగుపరచుకోవాలని, అందుకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం తప్పనిసరి చేయాలని ఆయన సూచించారు.
ప్రాజెక్టుల రాకకు అనుగుణంగా..
కరోనా కారణంగా ప్రాజెక్టులు తగ్గవచ్చన్న అంచనాతో ఐటీ సర్వీస్ కంపెనీలు 20-30 శాతం ప్రాంగణ నియామకాలు తగ్గించుకుంటున్నాయని ఎంవీఎస్ఆర్ కళాశాల ప్రాంగణ నియామకాల అధికారి ప్రసన్నకుమార్ చెప్పారు. ఓ ప్రముఖ కంపెనీ ఏటా తమ కళాశాలలో 150 మందిని ఎంపిక చేసుకునేదని, ఈసారి 94 మందినే తీసుకుందని ఆయన వివరించారు.
టాప్-5 కళాశాలలపై ప్రభావం లేకున్నా మొత్తం మీద ఐటీ నియామకాలు తగ్గుతాయని వాసవి కళాశాల అధికారి కిశోర్ అభిప్రాయపడ్డారు. సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ కంపెనీలు అవసరాల మేరకు సంఖ్యను పెంచుకుంటున్నాయని చెప్పారు. తమ కళాశాలలో గత ఏడాది సర్వీస్ నౌ కంపెనీ 25 మందిని ఎంపిక చేసుకోగా.. ఈసారి 35 మందిని నియమించుకుందన్నారు.