పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ జట్టు ఆఖరి నిమిషంలో టోర్నీని పూర్తిగా రద్దు చేసుకుంది. భద్రతా కారణాల రీత్యా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆటగాళ్ల భద్రతే తమకు అన్నింటికన్నా ముఖ్యమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తమ ఆటగాళ్లను తిరిగి న్యూజిలాండ్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ వెల్లడించారు.
పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు శుక్రవారం నుంచి మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడాల్సి ఉంది. అయితే, ఈ రోజు మధ్యాహ్నం రావల్పిండిలో ప్రారంభమవ్వాల్సిన తొలి వన్డే నిర్ణీత సమయానికి మొదలవ్వలేదు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు హోటల్ గదులకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాలతో ఈ పర్యటనను విరమించుకుంటున్నట్లు న్యూజిలాండ్ వెల్లడించింది.
ఇది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు పెద్ద షాకే అయినా ఆటగాళ్ల భద్రతే తమకు ప్రాముఖ్యమని తేల్చి చెప్పింది. మరోవైపు ఈ విషయంపై స్పందించిన పీసీబీ.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుందని ఓ ప్రకటనలో తెలిపింది. తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆటగాళ్ల భద్రతపై న్యూజిలాండ్ ప్రధానితో మాట్లాడినా వాళ్లు ఇలా ఉన్నపళంగా టోర్నీని రద్దు చేసుకుంటున్నారని తెలిపింది. ఇప్పటికీ తాము షెడ్యూల్ ప్రకారం మ్యాచ్లను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని వివరించింది.
ఇదీ చూడండి: తెరపైకి కోహ్లీ-రోహిత్ విభేదాలు.. అసలేం జరిగింది?