తాండూరు నియోజకవర్గ పరిధి గ్రామాల్లో ప్రాణాపాయస్థితికి లోనైన వారిని ఆసుపత్రులకు తరలించేందుకు అవసరమైన 108 వాహనాలు అందుబాటులో లేవు. కుటుంబ సభ్యులు ఆటోల ద్వారా అనేక వ్యయప్రయాసాల కోర్చి ఆసుపత్రికి తరలించాలి వస్తోంది. కొన్నిసార్లు ప్రైవేటు వాహనాలు సైతం రాకపోతే ఎక్కడో ఉన్న అంబులెన్స్ వచ్చే వరకు వేచి చూడక తప్పడం లేదు.
ఇలా చేయాలి..
గతంలో మండలానికి ఒక 108 వాహనం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. దాన్ని వెంటనే అమలు చేయాలి. జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఒక వాహనాన్ని అందుబాటులో ఉంచాలి. గర్భిణులు, ప్రమాద బాధితులకు ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవలు అందించేందుకు వాహనాల్లోనే వైద్య పరికరాలను ఏర్పాటుచేయాలి. కేసు తీవ్రను బట్టి వైద్యులు సైతం వాహనాల్లో సేవలు అందించాలి. రోగులు ఫోన్ చేసిన వెంటనే సిబ్బంది తక్షణం స్పందించి ఎంత సేపట్లో రాగలరో చెప్పాలి.
సర్వే చెబుతున్న విషయం...
వికారాబాద్ జిల్లాలో 108 వాహనాల నిర్వహణ తీరుతెన్నులు ఎలా ఉన్నాయనే విషయమై దాదాపు 100 మందితో ఈటీవీ భారత్ సర్వే నిర్వహించగా వాహనాల సంఖ్య మరింత పెంచాల్సిన అవసరాన్ని ప్రత్యేకంగా చెప్పారు.
ప్రాణ రక్షణే లక్ష్యం
రోగుల ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా జిల్లాలో 108 వాహనం ద్వారా మెరుగైన సేవలందిస్తున్నాం. దూర ప్రాంతం అయితే వాహనం వెళ్లటానికి కొంత ఆలస్యం అవుతుంది. వాహన సిబ్బంది స్పందించని సమయంలో ఆస్పత్రి సిబ్బంది, గ్రామస్థులు మాకు ఫోన్ చేసి సమాచారాన్ని అందిస్తున్నారు. వెంటనే కోఆర్డినేటర్కు విషయాన్ని చేరవేస్తున్నాం. ముందు ముందు సేవలు ఇంకా మెరుగు పడతాయి. - సుధాకర్ షిండే, జిల్లా వైద్యాధికారి,వికారాబాద్
జిల్లాలో నిర్వహణ తీరు
- 108 వాహనాలు ఉన్నవి 9 (వికారాబాద్, కుల్కచర్ల, పరిగి, కొడంగల్, తాండూరు, బంట్వారం, మోమిన్పేట, మర్పలి, యాలాల్ మండల కేంద్రాలు. అత్యవసర పరిస్థితిలో ఈ కేంద్రాల నుంచే ఇతర మండలాలకు వెళుతుంటాయి).
- పరిగి నియోజకవర్గం ప్రజల కోసం ఇటీవలే ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అధునాతన అంబులెన్స్ వాహనాన్ని తన సొంత నిధులతో సమకూర్చారు.
- తక్కువ వాహనాలు ఉండటంతో నిర్ణీత వేళకు వెళ్లలేక, సేవలు అందించలేకపోతున్నామని సిబ్బంది వాపోతున్నారు.
- ధారూర్ మండలానికి చెందిన బాధితుల కోసం అత్యవసర సమయాల్లో వికారాబాద్ నుంచి వాహనం రావాల్సి వస్తోంది.
- క్షత్రగాత్రులను ముందుగా వికారాబాద్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స జరిపి అవసరం అయితే హైదరాబాద్కు తరలిస్తున్నారు. వీరిని వెంటనే తీసుకెళ్లడానికి కొన్నిసార్లు వాహనాలు దొరకడంలేదు. చేసేది లేక అధిక మొత్తాలు పెట్టి ప్రైవేటు వాహనాల్లో వెళ్లాల్సి వస్తోంది.
- పరిగి సివిల్ ఆసుపత్రిలో ఒక వాహనం మరమ్మతుకు గురైంది. దానిని బాగు చేసి పూడూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి పంపితే అక్కడి మండల ప్రజలకు మేలు కలుగుతుంది.
- పూడూరు, పరిగి, కుల్కచర, దోమ మండలంలోని పలు తండాలకు తండాలకు రవాణా సదుపాయం బాగా లేదు. దీంతో 108 వాహనదారులు రావడానికి ఆసక్తి చూపడంలేదని ప్రజలు తెలియజేస్తున్నారు.
- కొడంగల్ నియోజకవర్గంలో ప్రతి రోజు 24 గంటల వ్యవధిలో దాదాపు 20 కాల్స్ వస్తే కేవలం 4 నుంచి 5 కాల్స్కు మాత్రమే సేవలు లభిస్తున్నాయి.
ఇవీ చూడండి: 'తొందరపడి అమ్ముకోవద్దు... మొత్తం మేమే కొంటాం'