తెలంగాణలో మరో ప్రముఖ టెక్స్టైల్ కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. దేశంలో రెడిమేడ్ వస్త్రాల తయారీలో ప్రముఖ పరిశ్రమగా పేరుగాంచిన గోకల్ దాస్ కంపెనీ రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రగతిభవన్లో టెక్స్టైల్ శాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో పరిశ్రమలు, ఐటీ శాఖ ఉన్నతాధికారులతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇప్పటికే సిరిసిల్లలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 65 ఎకరాల్లో పెద్దూరు గ్రామపరిధిలో ఏర్పాటు చేయనున్న అపరల్ పార్కులో ఈ కంపెనీ తన కార్యకలాపాలను కొనసాగించనుంది. ఇప్పటికే ఈ పార్కుకు సంబంధించిన మౌలిక వసతుల కల్పన పూర్తైంది. ఈ పార్కు పూర్తయిన తర్వాత సిరిసిల్ల కేంద్రంగా పవర్లూమ్ పరిశ్రమతో పాటు స్థూలంగా టెక్స్టైల్, అపరల్ పరిశ్రమకి అద్భుతమైన అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి.
75 శాతం మహిళలకే అవకాశం..
గోకల్ దాస్ ఇమేజెస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుమిర్ హిందూజా మంత్రి కేటీఆర్ను కలిసి తమ పెట్టుబడి కార్యాచరణను వివరించారు. తమ కంపెనీ కార్యకలాపాల ద్వారా నేరుగా సుమారు 1100 మందికి ఉద్యోగాలు వస్తాయని... ఇందులో మహిళలకు 75 శాతం అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ మేరకు సిరిసిల్ల చుట్టుపక్కల గ్రామాల పరిధిలో ఉన్న మహిళలకు అవసరమైన శిక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వంతో కలిసి చేపడతామని తెలిపారు. తమ కంపెనీ 4 నాలుగు దశాబ్దాలకు పైగా అపరెల్ రంగంలో ఉందని... ముఖ్యంగా రెడీమేడ్ వస్త్రాల తయారీలో విస్తృతమైన శ్రేణిలో తమ కంపెనీ కార్యకలాపాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో స్నేహపూర్వక పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయి బ్రాండ్లకు తమ కంపెనీ వస్త్రాలను సరఫరా చేస్తుందని... ప్రస్తుతం సిరిసిల్లలో ప్రారంభించబోయే ఫ్యాక్టరీ నుంచి అమెరికా, యూరప్లోని ప్రముఖ బ్రాండ్లకు దుస్తులను అందిస్తామన్నారు.
మంత్రి కేటీఆర్ హర్షం...
రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు రావడం పట్ల తెలంగాణ టెక్స్టైల్ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే టెక్స్టైల్ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా ఉంచి అనేక కార్యక్రమాలను చేపడుతోందని... రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు శిక్షణ కార్యక్రమాలను సైతం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో టెక్స్టైల్ పరిశ్రమలో ఇప్పటిదాకా ప్రధానంగా వస్త్రాల తయారీ ఉందని ఈ కంపెనీ కార్యకలాపాల ద్వారా రెడీమేడ్ గార్మెంట్స్ పరిశ్రమ ప్రస్థానం ప్రారంభమైందన్నారు. ఈ పరిశ్రమ తన కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత మరిన్ని అపరెల్ కంపెనీలు తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తాయన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. గోకల్ దాస్ కంపెనీని సిరిసిల్లకు ఆహ్వానించిన మంత్రి కేటీఆర్... కంపెనీ కార్యకలాపాలకు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రగతిభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, టెక్స్టైల్ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్, టిఎస్ఐఐసీ ఎండీ వెంకటనరసింహా రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.