Telangana Assembly special session : సామాజిక ఆర్థిక సర్వే, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికలపై చర్చే ప్రధాన అజెండాగా అసెంబ్లీ ఉభయ సభలు ఇవాళ సమావేశం కానున్నాయి. శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై తీర్మానం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతకంటే ముందే అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశం కానున్న మంత్రివర్గం కుల గణన సర్వే, ఎస్సీ కమిషన్ నివేదికలపై చర్చించి ఆమోదం తెలపనుంది.
కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చ : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రెండు కీలకాంశాలపై చర్చించేందుకు శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశం ఇవాళ జరగనుంది. కుల గణన సర్వే, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికలపై చర్చించి ఆమోద ముద్ర వేసేందుకు ఉభయసభలు భేటీ కానున్నాయి. ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ రెండు అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేయనుంది. అనంతరం ఉదయం 11గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం కానుంది. జనాభాకు తగినట్టుగా నిధుల కేటాయింపు, అభివృద్ధి పథకాల అమలు, విద్య, ఉద్యోగ అవకాశాల కల్పన జరగడం లేదన్న భావన బీసీల్లో ఉంది.
బీసీ రిజర్వేషన్లపై తీర్మానం : అధికారంలోకి వస్తే సామాజిక వర్గాల వారీగా ఎంత జనాభా ఉంటే ఆ మేరకు నిధులు, మెరుగైన అవకాశాలు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇందుకోసం కులగణన చేపడుతామని ప్రకటించింది. ఇందుకు అనుగుణంగానే రాష్ట్రంలో లక్ష మంది అధికార యంత్రాంగంతో కుల గణన సర్వేను ప్రభుత్వం పూర్తిచేసింది. ఈ సామాజిక, ఆర్థిక సర్వే నివేదికలోని వివరాలను మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే వెల్లడించింది. ఈ నివేదికను అసెంబ్లీ ఉభయ సభల్లో ప్రవేశ పెట్టి చర్చించి ఆమోదించనున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించే అంశంపైనా సభలో తీర్మానం చేసే అవకాశం ఉంది.
ఎస్సీవర్గీకరణపై ఏకసభ్య కమిషన్ : ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ నివేదికపైనా ఇవాళే అసెంబ్లీలో చర్చ జరగనుంది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రిజర్వేషన్ల అమలు కోసం ఏర్పాటైన జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ మంత్రివర్గ ఉపసంఘానికి నివేదికను అందచేసింది. ఎస్సీ ఉపకులాలను నాలుగు కేటగిరిలుగా విభజించాలని ఈ కమిషన్ సిఫార్సు చేసినట్లు సమాచారం. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వెనుకబాటును ప్రాతిపదికగా తీసుకుని ఈ మేరకు నివేదించినట్లు తెలుస్తోంది.
తొలి కేటగిరిలో అత్యంత వెనుకబడిన ఉపకులాలు, రెండో కేటగిరిలో మాదిగ, మాదిగ ఉపకులాలు, మూడో కేటగిరిలో మాల, మాల ఉపకులాలు, నాలుగో కేటగిరిలో ఇతర ఉపకులాలను చేర్చినట్లు సమాచారం. ఈ నివేదికపై రెండు దఫాలుగా చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం సీఎం రేవంత్ రెడ్డితోనూ సమావేశమైంది. ఇందులోని అంశాలు సిఫార్సులపై అంతా కలిసి చర్చించారు. ఈ నివేదికను ఇవాళ మంత్రివర్గం ఆమోదించిన తర్వాత ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనుండగా ఇదే రెండు అంశాలపై శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటన చేస్తారు.
తెలంగాణలో కుల గణన సర్వే పూర్తి - ఓసీలు 15.79 శాతం, బీసీలు ఎంతంటే?
రాజధానిలో రేషన్కార్డుల మంజూరులో జాప్యం - జనవరి 26న పంపిణీ లేనట్లేనా?