Numaish Exhibition : కొవిడ్ ఉద్ధృతితో అర్ధాంతరంగా ఆగిపోయిన 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన- నుమాయిష్ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. హైదరాబాద్ నాంపల్లి మైదానంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్.. 45 రోజుల పాటు కొనసాగాల్సి ఉండగా ఒమిక్రాన్ ఉద్ధృతితో నుమాయిష్ నిలిపివేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆదేశించింది.
అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గిపోవటం, పరిస్థితులు అదుపులోకి రావటంతో.. ఈనెల 25 నుంచి నుమాయిష్ను తిరిగి నిర్వహించాలని ఎగ్జిబిషన్ సొసైటీ నిర్ణయించింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు నిర్వహిస్తామని.. వారాంతాల్లో మరో అరగంట పొడిగించి 11 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుందని ప్రకటించింది. ఎట్టకేలకు నుమాయిష్ తిరిగి ప్రారంభం అవుతుండటంతో ఇటు హైదరాబాద్ నగరవాసులు, వస్త్ర వాణిజ్య వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి : Night Curfew Lifted in AP: ఏపీలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం