వైద్య కళాశాలల్లో చేరే విద్యార్థులు వసతిగృహాల్లో ఉండాలంటే.. కచ్చితంగా ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకొని, కొవిడ్ లేదనే నిర్ధారణ పత్రంతో హాజరు కావాలి. వసతి గృహాల్లో చేరినప్పటి నుంచి 14 రోజుల పాటు వారిని విడి గదిలో (క్వారంటైన్లో) ఉంచి, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలి. ఎటువంటి కరోనా లక్షణాలు లేకపోతేనే తరగతులకు అనుమతించాలి. ఈ మధ్యకాలంలో లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స అందించాలి. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలను పునఃప్రారంభించడంపై ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది.
మార్గదర్శకాలు
- ప్రవేశ ద్వారం వద్దే థర్మల్ స్కానర్లను, మాస్కులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి.
- అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులందరూ కూడా ఆరోగ్యసేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
- కళాశాలలో ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్కు ధరించాలి.
- విద్యార్థుల మధ్య కనీసం 6 అడుగుల దూరం పాటించాలి.
- విద్యార్థులుండే వసతిగృహాలు, భోజనశాలలు, తరగతి గదులు, ప్రసంగ గదులు, ప్రయోగ శాలలు సహా వైద్య కళాశాల ప్రాంగణమంతా రోజుకు రెండు సార్లు శానిటైజ్ చేయాలి.
- భోజనశాలల్లో ఎక్కువమంది ఒకేసారి భోజనాలు చేయడానికి అనుమతించొద్దు.
- అన్ని బోధన ఆసుపత్రుల్లోనూ కనీసం 30 శాతం పడకలను విద్యార్థుల శిక్షణ కోసం కేటాయించాలి.
- విద్యార్థులు కళాశాలలో, వసతిగృహాల్లో ఒకేచోట గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలి.
క్వారంటైన్లో ఉంచడం ఎలా?
వసతిగృహాల్లో చేరే విద్యార్థులను 14 రోజుల పాటు ఒక్కొక్కరిని ఒక్కో గదిలో క్వారంటైన్లో ఉంచడం సాధ్యమయ్యే పని కాదని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే వైద్యకళాశాలలో ఒక గదిలో ఇద్దరు లేదా ముగ్గురుండేలా వసతిగృహాలను నిర్మించారు. ఉదాహరణకు మహబూబ్నగర్ వైద్య కళాశాలలో ఏటా 150 మంది విద్యార్థులుంటారు. నాలుగేళ్ల వైద్య విద్యార్థులను కలిపితే 600 మంది అవుతారు. ఇక్కడ వసతిగృహంలో ఉన్నది 200 గదులే. మరి 600 మందిని ఎలా సర్దుబాటు చేయగలరనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే వసతిగృహాల్లో విద్యార్థులను ఒకేచోట గుమిగూడకుండా, వెలుపలకు వెళ్లకుండా చూడడం కూడా సాధ్యం కాదని వైద్యవర్గాలు చెబుతున్నాయి.
అలా చేయడం కష్టమే
వైద్యకళాశాల మొత్తాన్ని రోజుకు రెండుసార్లు శానిటైజ్ చేయడం కూడా కష్టమని చెబుతున్నారు. మామూలుగా ఊడ్చడం కాకుండా సోడియం హైపోక్లోరేట్ ద్రావణాన్ని పిచికారి చేయాలి. ఒక్కసారి చేయడానికి కనీసం 3-4 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతమున్న సిబ్బంది సరిపోరు. ఇప్పుడు అవసరాల ప్రకారం పెంచుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అన్నింటి కంటే ఎక్కువ సమస్య ఎదురయ్యేది భోజనశాలలో. స్వల్ప సంఖ్యలో అంటే ఒక్కసారికి సుమారు 25 మందిని మాత్రమే అనుమతించాల్సి ఉంటుంది. 600 మంది విద్యార్థులున్న కళాశాలలో 25 మంది చొప్పున భోజనాలు చేయాలంటే చాలా సమయం పడుతుంది.
తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు చెప్పాలి
విద్యార్థుల ఆరోగ్యంపై కళాశాలలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే స్వీయ నియంత్రణే అన్నింటి కంటే ముఖ్యం. గుంపుల్లోకి వెళ్లకూడదనీ, బయట తిరగొద్దని తమ పిల్లలకు తల్లిదండ్రులే జాగ్రత్తలు చెప్పాలి. ఎందుకంటే ఇది కొవిడ్ సమయం. మునుపటి మాదిరిగా తిరిగితే కరోనా బారినపడే ప్రమాదం ఉంది.
-డాక్టర్ పుట్టా శ్రీనివాస్, మహబూబ్నగర్ ప్రభుత్వ వైద్యకళాశాల సంచాలకుడు
ఇదీ చదవండి : టీకా లెక్క పక్కాగా... జాబితా తయారీపై వైద్యారోగ్యశాఖ కసరత్తు