రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి అంటూనే... వివక్ష చూపుతోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సీఎంగా కేసీఆర్ కుర్చీలో కూర్చున్నదే విద్యార్థులు, ఉద్యోగుల త్యాగాలతోనన్నారు. అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. నూతన ఉద్యోగ కల్పన లేకుండా చేశారని ఆరోపించారు. కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో పరిపాలన సౌకర్యార్థం మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆరేళ్లలో ధరలు రెట్టింపు అయ్యాయని... ఉద్యోగుల పీఆర్సీ చూస్తే మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.
ఉద్యోగుల హెచ్ఆర్ఏ యథావిధిగా కొనసాగించాలని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వానికి... ఉద్యోగులంటే ఎందుకింత చులకన భావమని ప్రశ్నించారు. ఇంతా జరుగుతున్నా ఉద్యోగ సంఘాల నేతలు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఉద్యోగ సంఘాల నేత భావిస్తున్న శ్రీనివాస్ గౌడ్... మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు... ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తే తప్ప ప్రభుత్వం దిగిరాదన్నారు. సంఘాల నేతలు... పాలకులకు తొత్తులుగా ఉంటే ఎప్పటికీ హక్కులు సాధించలేరని వ్యాఖ్యానించారు. ఉద్యోగులు, నిరుద్యోగులతో సీఎం కేసీఆర్ చెలగాటమాడొద్దని హితవు పలికారు.
ఇదీ చూడండి: బడ్జెట్తో 99% మందికి అన్యాయం: రాహుల్