Unauthorized Layouts Registration in Telangana: రాష్ట్రంలో అనధికార రిజిస్ట్రేషన్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్కు మార్గం సుగమం కానుంది. అయితే నిబంధనలు పాటించిన వాటికే ఈ విధానం వర్తించనుంది. దాదాపు రెండున్నరేళ్లుగా నిలిచిపోయిన అనధికార లేఅవుట్లలోని ప్లాట్లలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు ఉన్నవాటికి లేఅవుట్ క్రమబద్దీకరణ చార్జీలను తీసుకుని రిజిస్ట్రేషన్లకు అనుమతించేలా ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఇందుకు సంబంధించి ఉత్తర్వలు వెలువడనున్నాయి.
ఎల్ఆర్ఎస్ ప్రక్రియ నిలిపివేత: రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ రెండు రోజుల పాటు సుదీర్ఘ కసరత్తు చేశాయి. నిబంధనల మేరకు ఉన్న అనధికార లేఅవుట్లలో రిజిస్ట్రేషన్కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఉంటూ ఎల్ఆర్ఎస్ చార్జీలను చెల్లించిన లేఅవుట్లలో ప్లాట్లకు రిజిస్ట్రేషన్లకు అనుమతించాలని నిబంధనలు సిద్దమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అనధికార లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లను 2020 సెప్టెంబర్లో నిలిపివేసింది. అదే సంవత్సరం అక్టోబరు 31 వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్ల యజమానులతో పాటు వేల సంఖ్యలో అనధికార లేఅవుట్లున్నాయి. వీటిని పరిశీలించి ఎల్ఆర్ఎస్లను అనుమతించే ప్రక్రియ నేపథ్యంలో న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ నిలిచిపోయింది.
చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం: మూడేళ్లుగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ నిలిచిపోవడంతో అనేక మంది ప్లాట్ల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులు మాత్రం రుసుము చెల్లించి అనుమతులు పొంది నిర్మాణాలు చేసుకునేందుకు పురపాలక నిబంధనల మేరకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్లలో కూడా నిబంధనలు అమలు చేస్తూ అనధికార ప్లాట్ల రిజిస్ట్రేషన్కు ఎల్ఆర్ఎస్ ఫీజులు తీసుకుని రిజిస్ట్రేషన్కు అనుమతించేలా చర్యలు తీసుకుంటుంది. దరఖాస్తు చేసుకున్న అనధికార లేఅవుట్లకు సంబంధించిన సర్వే ఇప్పటికే పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు పూర్తి చేశాయి. ఎటువంటి ఉల్లంఘనలు లేకుండా నిబంధనలు మేరకు ఉన్నవాటిని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి ముందుకు వచ్చే దరఖాస్తుదారులకు అవసరమైన తోడ్పాలు అందించేందుకు ఆయా శాఖలు సిద్దమవుతున్నాయి.
ఇవీ చదవండి: