సచివాలయ ప్రాంగణంలో నిర్మించే గుడి, మసీదు, చర్చిల నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మసీదు నిర్మాణానికి ఫిబ్రవరి 26వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. సచివాలయ ఉద్యోగులు, ముస్లిం ప్రజాప్రతినిధులు, మతపెద్దలతో బీఆర్కే భవన్లో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప లౌకికవాది అని ... అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారని మంత్రులు తెలిపారు. సచివాలయంలో ప్రార్థనా మందిరాల నిర్మాణం విషయంలో ఎటువంటి అనుమానాలకు ఆస్కారం లేదని... ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీనిచ్చారు. మరోమారు సమావేశం నిర్ణయించి నమూనాలు సహా సంబంధిత అంశాలపై చర్చించనున్నారు.
కేసీఆర్ నిబద్ధత, అంకితభావం పట్ల తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని, ప్రార్థనా మందిరాలను సకాలంలో నిర్మిస్తారన్న నమ్మకంతో ఉన్నామని మతపెద్దలు సంతృప్తి వ్యక్తం చేశారు.
సచివాలయం కూల్చివేత సమయంలో ఆ ప్రాంగణంలోని గుడి, మసీదు, చర్చి.. నేలమట్టమయ్యాయి. దీనిపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. అదే స్థానంలో ప్రార్థన మందిరాల నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది.
ఇవీచూడండి: వంటిమామిడి కూరగాయల మార్కెట్ను ఆకస్మిక తనిఖీ చేసిన కేసీఆర్