హైదరాబాద్కి చెందిన నిహంత్రీరెడ్డి చిన్నతనం నుంచే నృత్యంపై ఆసక్తి పెంచుకుంది. మంచి నర్తకిగానే కాక గాయని, గిటారిస్ట్, వీణ, షార్ప్ షూటర్గానూ తన ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తూ ఎన్నో పురస్కారాలు, ప్రశంసలు అందుకుంటూ ముందుకు సాగుతోంది. దేశ, విదేశాల్లో వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చి... జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటుకుంటోంది. నిహంత్రీ రెడ్డికి బహుళ జాతీయ సంస్థల్లో కోటి రూపాయల వేతనంతో ఉద్యోగం వచ్చినా.. కళ పట్ల ఉన్న మక్కువతో ఈ రంగాన్నే తన జీవితంగా ఎంచుకొంది. హైదరాబాద్లో సొంతంగా కూచిపూడి పాఠశాల స్థాపించి.. తెలుగు రాష్ట్రాలు సహా అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో యువతలకు, చిన్నారులకు నృత్యరీతులు నేర్పుతోంది.
నిహంత్రీరెడ్డి స్వస్థలం కడప మంగంపేట. పుట్టింది, పెరిగింది హైదరాబాద్లోనే. చిన్నతనం నుంచే నృత్య సాధన ప్రారంభించి.. 11 ఏళ్ల వయసున్నప్పుడు 2007లో తిరుపతిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంది నిహంత్రీ. తర్వాత ప్రఖ్యాత నృత్యకారిణి శోభానాయుడు వద్ద నృత్య శిక్షణ తీసుకుంది. 16 వ ఏట శోభానాయుడు పర్యవేక్షణలో రవీంద్రభారతి వేదికగా అరంగేట్రం చేసింది. నిహంత్రీరెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూచిపూడిలో మాస్టర్స్ చివరి సంవత్సరం చదువుతోంది. తన నృత్య రూపాల్లో హోలిక దహనం, చండాలి, నవరస నట భామిని, సర్వం, సాయిమయం, జగదానంతకార వంటివి ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. నృత్య ప్రధానాంశంగా రూపొందుతున్న లవ్ ఎట్ 65 అనే సినిమాలో కీలకపాత్రలో నటించింది.
"నా మొట్టమొదటి నృత్య ప్రదర్శన విశాఖ స్టీల్ ప్లాట్లో ఇచ్చాను. అప్పటి నుంచి ఎన్నో ప్రదర్శనలు మా గురువుగారితో కలిసి ఇచ్చాను. మంచి మంచి డాన్స్ ఫెస్టివల్స్లో, గౌరవప్రదమైన వేదికలపైన ప్రదర్శనలిచ్చాను. కోణార్క్ డాన్స్ ఫెస్టివల్, కజురహో నృత్యోత్సవ్, దుర్గాపూల్ నృత్యోత్సవ్, నాద నీరాజనం, దూరదర్శన్లో రికార్డింగ్స్ లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. కొన్ని సందర్భాల్లో ప్రముఖులతో ప్రశంసలతో పాటు సన్మానాలు కూడా అందుకున్నాను. తెలంగాణ ప్రభుత్వం స్త్రీ శక్తి అవార్డుతో సత్కరించింది. ఆ తర్వాత నాట్యమంజరి అవార్డు దక్కింది. తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్నాను."- నిహంత్రీ రెడ్డి, నృత్యకారిణి
నిహంత్రీ కూచిపూడి అకడామీ విజయవంతంగా నిర్వహిస్తోంది. నిత్యం 150 మంది విద్యార్థులకు శిక్షణనిస్తోంది. ఆఫ్లైన్, ఆన్లైన్లో తరగతులు కొనసాగిస్తూ ప్రత్యేకత చాటుకుంటోంది. ఇటీవల.. దిల్లీలో నిహంత్రీ కూచిపూడి నృత్యం తిలకించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసల్లో ముంచెత్తారు. నిహంత్రీ ప్రదర్శనలు చూసిన పలువురు గృహిణులు..మధ్యలో వదిలేసిన నృత్యాన్ని మళ్లీ నేర్చుకుంటున్నారు.
"నేను నిహంత్రీ అక్క దగ్గర నాలుగేళ్ల నుంచి నేర్చుకుంటున్నాను. అక్క ప్రోత్సాహం వల్లే గతేడాది "ఇండియన్ రాగ" టైటిల్ గెలుచుకున్నాను. ఒక స్నేహితురాలిలాగా ఉంటూ.. వచ్చే వరకు నేర్పిస్తూనే ఉంటుంది. కొంచెం కూడా చిరాకు పడదు. అక్క నుంచి నేర్చుకునే అంశాలు చాలా ఉన్నాయి. నృత్యం పట్ల అక్కకున్న ప్రేమ, క్రమశిక్షణ, సహనం ఇలా చాలా విషయాలు తన నుంచి నేర్చుకోవాల్సిందే." - ధన్విశ్రీమయి, హైదరాబాద్
సింగపూర్, శ్రీలంక, మలేషియా, దుబాయి వంటి దేశాల్లో.. కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చి అంతర్జాతీయంగా తెలుగుఖ్యాతిని చాటింది నిహంత్రీరెడ్డి. కుమార్తె సాధించిన విజయాల పట్ల ఈమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపిస్తోంది నిహంత్రీరెడ్డి. భారతీయ కూచిపూడి నృత్యం ప్రపంచం నలుమూలలకు చాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. త్వరలో "తానా" ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
ఇవీ చూడండి: