హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం ప్రవేశ పరీక్షలు సెప్టెంబరు 24, 25, 26న నిర్వహించనున్నట్టు ఉపకులపతి ఆచార్య అప్పారావు ప్రకటించారు. దేశవ్యాప్తంగా 38 కేంద్రాల్లో మూడు సెషన్లలో ఎంట్రన్స్ ఉంటుందన్నారు. గతేడాది మాదిరిగానే ఆఫ్లైన్లో పెన్ను, పేపర్ విధానంలో.. రెండు గంటల వ్యవధి ప్రవేశ పరీక్ష ఉంటుందని వీసీ పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల కారణంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో.. అత్యధికంగా 65వేల దరఖాస్తులు వచ్చినట్టు వీసీ వెల్లడించారు.
నవంబరు 1 వరకు ప్రక్రియ పూర్తి చేసి.. తరగతులు ప్రారంభించాలని భావిస్తున్నట్లు అప్పారావు తెలిపారు. రేపటి నుంచి ఆన్లైన్ తరగతులతో పీజీ విద్యా సంవత్సరం ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నారు. సుమారు 2 వేల 300 మంది పీజీ విద్యార్థులు ఆన్లైన్ తరగతులకు హాజరవుతారన్నారు. డిసెంబర్ నెలాఖరుకి ఆన్లైన్ సెమిస్టర్ పూర్తి చేస్తామని... విద్యార్థులు ఆన్లైన్లోనే సెమిస్టర్ నమోదు చేసుకోవాలన్నారు. ఫీజులు వెంటనే చెల్లించాల్సిన అవసరం లేదని వీసీ అప్పారావు తెలిపారు.