రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను విద్యాశాఖ శుక్రవారం రాత్రి ప్రకటించింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని వివిధ విభాగాల నుంచి 48 మందిని ఎంపిక చేశారు. అందులో ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్ల విభాగంలో పది మంది ఉన్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారు.
ఉపాధ్యాయ దినోత్సవం(Teachers' Day) సందర్భంగా ఆదివారం రవీంద్రభారతి ఆడిటోరియంలో జరిగే ఉత్సవాల్లో ఉపాధ్యాయులకు పురస్కారాలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది కరోనా కారణంగా పురస్కారాలను ఆయా అవార్డు గ్రహీతల ఇళ్లకు వెళ్లి అధికారులు అందజేశారు. పురస్కారాలకు ఎంపికైన వారు శనివారం మధ్యాహ్నం 2 గంటలలోపు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సూచించారు. సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వారితో సమావేశం కానున్నారు.