రంగస్థలంలో 135 ఏళ్ల చరిత్ర ఉన్న సురభి కళాకారులను కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. నాటకం తప్ప మరే ఉద్యోగ, ఉపాధి మార్గాలు తెలియని కళాకారులు ఆరునెలలుగా ఎలాంటి నాటకాలు, ప్రదర్శనలు లేక అల్లాడిపోతున్నారు. హైదరాబాద్లోని లింగపల్లి సమీపంలోని సురభి కాలనీలో సుమారు 240 కుటుంబాలున్నాయి. గతంలో వీరంతా వివిధ ప్రాంతాల్లో ఉంటూ నాటకాలు ప్రదర్శించేవాళ్లు. ఎన్టీఆర్ హయాంలో సురభి కళాకారులను గుర్తించిన ప్రభుత్వం లింగంపల్లి సమీపంలో ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి అక్కడే ఉంటూ వెంకటేశ్వర, వినాయక, విజయగణపతి, భానోదయ, శారద విజయ నాట్యమండలి ఇలా వివిధ రకాల పేర్లతో నాటక సమాజాలు ఏర్పాటు చేసుకున్నారు. తమదైన శైలిలో నాటకాలు ప్రదర్శిస్తూ... కొద్దోగొప్పో డబ్బులతో కుటుంబాలను పోషించుకునేవాళ్లు. ఇలా.. తరతరాలుగా నాటకాలనే నమ్ముకొని జీవిస్తున్న సురభి కళాకారులను కరోనా వైరస్ దెబ్బతీసింది.
మార్చి 22కు ముందు నాటకాలు ప్రదర్శించిన సురభి కళాకారులు... ఆ తర్వాత ఇళ్లకే పరిమితమయ్యారు. అప్పటికే ఆర్థికంగా నిలదొక్కుకున్న కొందరు ధైర్యంగా ఉండగా... మరికొందరు నిరుపేద కళాకారులకు పూట గడవడమే కష్టంగా మారింది. ఘనచరిత్ర ఉన్న సురభి కళాకారులుగా ఎవరిని దేహీ అని అడగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో మళ్లీ నాటకాలు ఎప్పుడు కోలుకుంటాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇచ్చే కళాకారుల ఫించన్లు... మధ్యలోనే నిలిచిపోయాయి. కొందరికి రేషన్ కార్డులు రద్దయ్యాయి. దిక్కుతోచని స్థితిలో పడ్డ నిరుపేద కళాకారులు... దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సురభి చరిత్రను ప్రభుత్వం గుర్తించి తమను ఆదుకోవాలని పేద కళాకారులు వేడుకుంటున్నారు. అందరినీ అలరింపజేసే తమకు... ఆర్థికంగా చేయూతనిచ్చి గట్టెక్కించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'ఆయన అలంకరించిన ప్రతి పదవికి వన్నె తెచ్చారు'