PETROL BUNKS: ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులోని పెట్రోలు బంకుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఈ పరిస్థితిపై అనంతపురం జిల్లా సరిహద్దులోని రెండు బంకులను ఈటీవీ-ఈటీవీ భారత్ బృందం సందర్శించింది. మనవైపు బంకులు వెలవెలబోతుంటే.. కర్ణాటక బంకులు వినియోగదారులతో కళకళలాడుతున్నాయి. ఇక్కడి బంకులు వ్యాపారం లేక మూతపడితే.. అక్కడి బంకుల్లో జోరుగా అమ్మకాలు సాగుతున్నాయి. ఏపీ బంకులు.. వాహన స్టాండ్గా మారిపోతే.. కర్ణాటక బంకులు పెట్రోలు పోయించుకునే వాహనాలతో.. రద్దీగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం పెట్రోలు ధరల్లో భారీ వ్యత్యాసమే.
కర్ణాటక సరిహద్దులోని ఏపీ బంకుల్లో ఒక్క లీటర్ ఇంధనం కూడా అమ్మకాలు జరగటం లేదు. కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై పన్ను తగ్గించింది. ఏపీతో పోల్చితే.. అక్కడ లీటర్ పెట్రోల్ రూ.12 తక్కువగా, లీటర్ డీజిల్ రూ.10 తక్కువగా ఉంది. ఫలితంగా వాహనదారులు కర్ణాటక బంకుల్లోనే కొనుగోలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా సరిహద్దు గ్రామాల ప్రజలైతే.. కర్ణాటక బంకులకు వెళ్లి ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. పనిలో పనిగా బాటిళ్లలో తెచ్చుకుంటున్నారు. ఇక పెద్దమొత్తంలో డీజిల్ అవసరం ఉన్నవారైతే.. ప్రత్యేకంగా వెళ్లి మరీ వందల లీటర్లలో కొనుగోలు చేస్తున్నారు.
ఇక ఆటోడ్రైవర్లైతే.. కొందరు కలిసి ఒక బృందంగా ఏర్పడి.. రోజుకొకరు చొప్పున వెళ్లి.. కర్ణాటక బంకుల్లో డీజిల్ తెచ్చుకుంటున్నారు. అనంతపురం జిల్లా సరిహద్దులో దాదాపు 60 బంకులు మూతపడ్డాయి. కొందరు డీలర్లు స్థలం వృథా ఎందుకని భూమి అమ్మేశారు. కొడికొండ సమీపంలోని.. ఒక పెట్రోల్ బంకు స్థలాన్ని వాహన పార్కింగ్గా మార్చేశారు. మరికొందరు.. గడ్డివాములు వేసుకోవటానికి పశువులు, గొర్రెల కాపర్లకు.. పెట్రోల్ బంకుల స్థలాన్ని అద్దెకు ఇచ్చారు.
రాయలసీమ జిల్లాల నుంచి రోజూ కూరగాయలు, పండ్లు తీసుకెళ్లే లారీలు.. కర్ణాటక నుంచి ఫుల్ ట్యాంకు చేసుకొని తిరిగి వస్తున్నాయి. ఫలితంగా.. ఆంధ్రప్రదేశ్ భారీగా ఆదాయం కోల్పోతోంది. బంకుల మూతతో ఇక్కడ ఉపాధి కోల్పోగా.. అక్కడ కొందరికి అదనంగా ఉపాధి దక్కింది. 8 ఏళ్ల క్రితం కర్ణాటక కంటే ఏపీలో పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.2 తక్కువగా ఉండేది. అప్పట్లో కర్ణాటక వాసులు.. ఏపీ బంకుల్లో ఇంధనం కొనుగోలు చేసేవారు. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఏపీలోనూ వ్యాట్ తగ్గించాలని పెట్రోల్ బంకు యజమానులు కోరుతున్నారు.
ఇవీ చదవండి..:
కేఎంపీఎల్ తగ్గిందని.. జీతం నుంచి కట్టమని డ్రైవర్కు డిపో మేనేజర్ నోటీసు