తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును దోస్త్ మరోసారి పొడిగించింది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును ఈ నెల 16 వరకు పొడిగించినట్లు దోస్త్ కన్వీనర్ ఆచార్య ఆర్.లింబాద్రి తెలిపారు. తొలి విడతలో సీటు పొందిన వారు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. నేటి వరకు 1,27,160 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్లు లింబాద్రి వెల్లడించారు.
ఆన్లైన్ రిపోర్టింగ్ గడువు నేటితో ముగిసినప్పటికీ.. విద్యార్థులు, తల్లిదండ్రుల వినతి మేరకు మరో నాలుగు రోజులు పొడిగిచినట్లు లింబాద్రి తెలిపారు. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే సీటు రిజర్వ్ అవుతుందని.. అవసరమైతే మెరుగైన సీటు కోసం రెండో విడతలో ప్రయత్నించవచ్చునన్నారు. రెండో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువు ఈనెల 18తో ముగియనుంది. రెండో విడతలో 18,256 మంది విద్యార్థులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 35,583 మంది వెబ్ ఆప్షన్లు సమర్పించినట్లు లింబాద్రి వెల్లడించారు.
ఇదీచూడండి: TS EAMCET: ఎంసెట్ రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీ విడుదల