ప్రభుత్వ కొవిడ్ ఆసుపత్రి గచ్చిబౌలి టిమ్స్లో రోగులు కష్టాలుపడుతున్నారు. ముఖ్యంగా ఐసీయూలో ఉన్నవారినీ సిబ్బంది పట్టించుకోవడం లేదని రోగుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కొవిడ్ రోగులతో నిండిపోయిన సంగతి తెలిసిందే. దీంతో గచ్చిబౌలిలో టిమ్స్కు రోగులు క్యూ కడుతున్నారు. నిత్యం 50-60 మంది ఈ ఆసుపత్రిలో చేరుతున్నారు. అందుకు తగ్గట్లు సేవలు మాత్రం అందడం లేదు.
పట్టించుకునే వారేరి..!
టిమ్స్లో దాదాపు 1261 పడకలున్నాయి. ఇందులో 135 ఐసీయూ కోసం కేటాయించారు. మరో 830 ఆక్సిజన్ పడకలుగా తీర్చిదిద్దారు. టిమ్స్లో వార్డుల పద్ధతి లేదు. ప్రతి అంతస్తులో రోగులకు సేవలు అందించేలా విశాలమైన గదులు ఉన్నాయి. మౌలిక వసతుల పరంగా ఇబ్బందులు లేకున్నా.. రోగులను ఎవరూ పట్టించుకోని పరిస్థితి కొనసాగుతోంది. ఇటీవల ఓ రోజు ఉదయం 8 గంటలకు ఇవ్వాల్సిన అల్పాహారం 11 గంటలకు, మధ్యాహ్న భోజనం 3 గంటలకు, రాత్రి భోజనం 11 గంటలకు ఇవ్వడంతో చాలా మంది రోగులు నిరసన తెలిపారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ స్పందించి కొత్త కాంట్రాక్టర్కు ఈ బాధ్యతలు అప్పగించింది.
ఐసీయూలో సేవలు మృగ్యం
ఐసీయూలో ప్రతి పడకకు ఒక నర్సును కేటాయించి ఎప్పటికప్పుడు రోగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలి. ఏ మాత్రం తేడా ఉన్నా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి. ఇవేవీ ఇక్కడ సిబ్బంది పట్టించుకోవడం లేదు. డైపర్లు కూడా అందించడం లేదు. రోగుల కుటుంబ సభ్యులే వాటిని కొని అటెండర్లతో పైకి పంపుతున్నారు. రోగులు వాటిని తొడుక్కునేందుకు పేషెంట్ కేర్ సిబ్బంది సహాయపడాలి. సాయం కోసం అభ్యర్థించినా ఎవరూ పట్టించుకోవడం లేదని రోగులు వాపోతున్నారు. తరచూ మార్చాల్సిన ఆక్సిజన్ కాన్యులాను 24 గంటలు గడిచినా మార్చకపోవడంతో సరైన ఆక్సిజన్ సరఫరా కావడం లేదని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఫోన్ల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిపై ఉన్నతాధికారులకు ఫోన్ చేసినా స్పందన ఉండటం లేదని రోగుల బంధువులు వాపోతున్నారు.
వేధిస్తున్న సిబ్బంది కొరత
ఆసుపత్రిలో అధికారికంగా 1261 పడకలు ఉన్నట్లు చూపుతున్నారు. ఈ స్థాయికి ఉండాల్సిన.. ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్, నర్సుల పోస్టుల్లో 199 వరకు ఖాళీగానే ఉన్నాయి. కీలకమైన 12 మంది ప్రొఫెసర్లు, 23 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 22 సహాయ ప్రొఫెసర్లు, 94 మంది మెడికల్ ఆఫీసర్లు, ఆరుగురు హెడ్ నర్సులు, 32 మంది స్టాఫ్నర్సులు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరో 200 మంది వరకు కింది స్థాయి సిబ్బంది సేవలు అవసరం. మూడు షిఫ్టుల్లో 40 మంది చొప్పున్న రోగుల సహాయ సిబ్బంది సేవలు అందించాలి. కేవలం 20 మందితోనే నెట్టుకొస్తున్నారు. 75 మంది రోగులకు ఇద్దరే పీజీ వైద్యులు దిక్కు అవుతున్నారు. దీంతో ప్రస్తుత సిబ్బందిపైనే తీవ్రమైన ఒత్తిడి పడుతోంది.
సిద్ధం ఊపిరికి కాస్త ఊరట
గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ద్రవీకృత వైద్య ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. దీంతో రోజూ 400 మంది రోగులకు ఊరట కలగనుంది. పీఎం కేర్ నిధులు రూ.2.5 కోట్లతో ఈ కేంద్రాన్ని నిర్మించారు. ఈ ప్లాంట్లో రెండు యూనిట్లు ఉంటాయి. ఒక్కో యూనిట్.. నిమిషానికి వెయ్యిలీటర్ల చొప్పున ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుంది. జనవరిలోనే అందుబాటులోకి తీసుకురావాలని భావించినా.. సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. ఇటీవల కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఈ ప్లాంటును పరిశీలించి, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. ఇతర ఉన్నతాధికారులూ.. వేగంగా పనులయ్యేలా చర్యలు తీసుకున్నారు.
‘కింగ్కోఠి’లో పోలీస్ హెల్ప్ డెస్క్
ఆసుపత్రికి వచ్చే కొవిడ్ అనుమానితులు, బాధితులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సమాచారం అందించేందుకు నగర పోలీసుల ఆధ్వర్యంలో వైద్య విధాన పరిషత్(కింగ్కోఠి) జిల్లా ఆసుపత్రిలో ‘కొవిడ్ హెల్ప్ డెస్క్’ను సిద్ధం చేశారు. శనివారం నగర సీపీ అంజనీకుమార్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు నారాయణగూడ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు తెలిపారు. ఈ హెల్ప్ డెస్క్లో పోలీస్ కానిస్టేబుళ్లు విధుల్లో ఉంటారు. ఆసుపత్రిలోని వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న వారి గురించి సమాచారాన్ని తెలుసుకోవచ్చునని ఇన్స్పెక్టర్ చెప్పారు. డెస్క్లో ఆక్సిమీటర్ కూడా అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తగిన మార్గదర్శనం చేస్తారని వివరించారు. ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు ఆధ్వర్యంలో అడ్మిన్ ఎస్సై కరుణాకర్రెడ్డి హెల్ప్ డెస్క్ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు.