* వనస్థలిపురానికి చెందిన వ్యక్తికి(50) రెండు రోజుల నుంచి జ్వరం, ఒళ్లు నొప్పులు ఉండటంతో పరీక్ష చేసుకుంటే కొవిడ్ ఉన్నట్లు తేలింది. ఇంటి వద్దే చికిత్స తీసుకుంటే చాలని వైద్యులు చెప్పారు. అప్పటి నుంచి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దాంతో గుండెపోటు వచ్చింది. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
* అమీర్పేటకు చెందిన ఓ వ్యక్తికి వారం రోజులుగా జ్వరం, ఆయాసం, దగ్గు లక్షణాలు ఉన్నాయి. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాడు. చివరికి ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో... సమీపంలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. పరిశీలిస్తే 80 కంటే తక్కువకు ఆక్సిజన్ శాతం పడిపోయింది. హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కరోనాపై అతి ధీమా...అతి భయం.. రెండూ ప్రమాదకరమేనని వైద్యులు పేర్కొంటున్నారు. రోగి గత ఆరోగ్య చరిత్ర.. కొవిడ్ లక్షణాలను బట్టి ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండాలా, లేదంటే ఆసుపత్రిలో చేరాలా అని వైద్యుల సలహాలు తీసుకోవాలి. 85 శాతం మంది ఇంట్లోనే చికిత్స తీసుకుంటే పూర్తిగా తగ్గిపోతోంది. కొందరు అనవసర ఆందోళనతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మరికొందరు ఎంతైనా ఖర్చు చేస్తాం.. ఆసుపత్రిలో పడక ఇప్పించాలని వేడుకుంటున్నారు. ఫలితంగా ఒకటి, రెండు రోజులు సాధారణ వార్డులో పడక కేటాయించి తర్వాత జాగ్రత్తలు చెప్పి డిశ్ఛార్జి చేస్తున్నామని ఓ వైద్యుడు తెలిపాడు.
వారం దాటినా జ్వరం తగ్గకపోతే... కొవిడ్ లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండటం లేదని గాంధీ సూపరింటెండెంట్ డా.రాజారావు తెలిపారు. 85 శాతం మందిలో స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉంటున్నాయి. ఇంట్లోనే చికిత్సలతోనే కోలుకుంటున్నారు. కొన్ని లక్షణాలు ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ నిర్లక్ష్యం చేయవద్దని సూచిస్తున్నారు. కొవిడ్ సోకిన తర్వాత వారం దాటినా జ్వరం విడవకుండా వస్తుంటుంది. దీనికి దగ్గు, ఆయాసం తోడైతే ప్రమాదం. ఆక్సిజన్ స్థాయిలో 94, 93, 92లకు తగ్గుతుంటే వెంటనే అప్రమత్తం కావాలి. ఇంట్లో ఆక్సిజన్ పెట్టుకునే సౌలభ్యం ఉంటే వైద్యులను సూచనలతో ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చు. ఆ సౌకర్యం లేని వారిని ఆసుపత్రిలో చేర్పించాలి.
ఇదీ చూడండి: రెండు వారాల్లో మూడింతలు.. ఐసీయూల్లో పెరిగిన కొవిడ్ బాధితులు