అసలే దూర ప్రాంతాల్లో పోస్టింగులు.. కరోనా వైరస్తో అవస్థలు. వీటికితోడు వేతనాలు అందకపోవడంతో ఆ ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పేరుకు ప్రభుత్వ ఉద్యోగమైనా.. కుటుంబాలను పోషించలేక దుర్భర జీవితం గడుపుతున్నామని వాపోతున్నారు. 2016లో గ్రూప్-2లో ఎంపికైన 257 మంది డిప్యూటీ తహసీల్దార్ల(డీటీల)కు ప్రభుత్వం గత నెలలో పోస్టింగులు ఇచ్చింది.
అదీ సుదూర ప్రాంతాల్లో. వీరికి శిక్షణ సమయానికి సంబంధించి రెండు నెలలు, ఉద్యోగంలో చేరిన తరువాత ఒక నెలకు సంబంధించి.. మొత్తం మూడు నెలల వేతనం అందాల్సి ఉంది. వారిలో 60 మంది డీటీలకు కరోనా సోకింది. యాదాద్రి జిల్లాకు చెందిన ఓ డీటీకి కరోనా రావడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతనికి తలా కొంత డబ్బు సేకరించి ఆర్థికసాయం చేశారు. మరికొందరు డీటీలు, వారి కుటుంబ సభ్యులు కూడా వైరస్ బారిన పడ్డారు. వేతనాలు రాకపోవడంతో చికిత్సకు, మందుల కొనుగోళ్లకు పడరాని పాట్లు పడుతున్నారు.
రాష్ట్రంలోని 280 మంది ఆబ్కారీ ఎస్సైలు పోస్టింగుల కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వీరికి ప్రభుత్వం గతేడాది నియామక ఉత్తర్వులు అందజేసింది. అనంతరం పోస్టింగులను విస్మరించింది. ఎక్సైజ్ అకాడమీకి అటాచ్ అయిన మరో 87 మంది ఎస్సైలకు గత మూడు నెలలుగా వేతనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు వేతనాలు అందించాలని డీటీలు, ఆబ్కారీ ఎస్సైలు కోరుతున్నారు.