విద్య, వైద్య, ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలల బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్స్ పంపిణీపై చర్చించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న 7 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థినులకు బ్రాండెడ్ సంస్థలకు చెందిన శానిటరీ న్యాప్ కిన్స్ను ఉచితంగా పంపిణీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. బాలికల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలన్నారు. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున ఉచిత శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ పథకం ప్రారంభించాలని స్పష్టం చేశారు.
ఏప్రిల్ 15 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని, ఏప్రిల్ నెలాఖరునాటికి ప్రతిష్టాత్మకమైన కంపెనీలతో సెర్ప్, మెప్మా ఎంఓయూ చేసుకుంటాయని అధికారులు సీఎంకు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థినులకు జూలై 1 నుంచి ప్రతినెలా ఉచితంగా నేప్ కిన్స్ పంపిణీ చేయనున్నారు. నెలకి 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ న్యాప్ కిన్స్ అందజేస్తారు. ఇందుకోసం సుమారు రూ. 41.4 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో చేయూత కిరాణా స్టోర్స్ ద్వారా అందుబాటులో తక్కువ ధరకే అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థినులకు పోటీ పరీక్షల కోసం అత్యుత్తమ శిక్షణ అందివ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికోసం లాప్టాప్లను వాడుకోవాలన్నారు.
అమ్మఒడి పథకంలో లాప్టాప్లు కావాలనుకున్న 9వ తరగతి.. ఆపైన విద్యార్థులకు ఇప్పటికే ఆప్షన్ ఇచ్చామని స్పష్టం చేసిన సీఎం..ప్రభుత్వం ఇస్తున్న కంప్యూటర్స్తో పాటు శిక్షణా సంస్థలు సహకారం తీసుకునే దిశగా ప్రణాళిక రచించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల నుంచి ల్యాప్టాప్ల ఆప్షన్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ల్యాప్టాప్ల సహకారంతో కోచింగ్ ఇవ్వాలన్నారు. ఇంటరాక్టివ్ విధానంలో, టెక్నాలజీని ఉపయోగించుకుంటూ.. ఎంపిక చేసిన నిపుణుల సహకారం తీసుకోవాలని తెలిపారు. దీని ద్వారా వీలైనంత ఎక్కువమంది విద్యార్థినులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసే కార్యక్రమాన్ని రూపొందించాలన్నారు.
ఇదీ చదవండి : నడిరోడ్డుపై కారు దగ్ధం