టీఆర్టీ 2017లో ఎంపికైన హిందీ పండిట్ల ఉద్యోగాలను భర్తీచేయాలని హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఎదుట వారు ఆందోళన చేపట్టారు. మూడేళ్లు గడుస్తున్నా నియామకాలు చేపట్టలేదంటూ... టీఎస్పీఎస్సీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆందోళనకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, నిరుద్యోగ ఐకాస ఛైర్మన్ నీలం వెంకటేష్ మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ కంటే ముందే... హిందీ పండిట్ల నియమకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక రబ్బర్ స్టాంప్గా తయారైందని ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. నోటిఫికేషన్లు వేయడం, నియామకాలు ఆపడం అలవాటు అయిపోయిందని మండిపడ్డారు. కోర్టు కేసుల పేరుతో కాలక్షేపం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని... ఇంకెప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. నిరుద్యోగుల గోస ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని.. లేకుంటే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని కృష్ణయ్య హెచ్చరించారు.