ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహిస్తామంటూ అక్కడి ఎన్నికల కమిషన్ నవంబరు 17న చేసిన ప్రకటనను సవాలు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మంగళవారం హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఎన్నికల సంఘం చర్యలను నిలిపివేయించాలని కోరారు. కరోనా తీవ్రత దృష్ట్యా పునరాలోచించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. ఎన్నికల సంఘం కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదిగా పేర్కొన్నారు.
వాజ్యంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘‘ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు, ఏపీ ప్రభుత్వ అభిప్రాయానికి విరుద్ధంగా వచ్చే ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ఏకపక్షంగా ప్రకటించింది. మార్చిలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఎన్నికల్ని ఆరు వారాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినప్పుడు కూడా ఏపీ ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించలేదు. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేసింది. అప్పటికే వాయిదాపై నిర్ణయం తీసుకున్నందున.. తదుపరి నోటిఫికేషన్ ఇస్తే ముందుగా ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీం ఆదేశించింది. ఇప్పటికీ ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగానే ఉంది. నవంబర్ 29 నాటికి ఆంధ్రప్రదేశ్లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,67,638కి చేరింది. మరణాల సంఖ్య 6,988. రోజుకు సగటున 1000 కొత్త కేసులు వస్తున్నాయి. పాజిటివిటీ రేటు 8.66 శాతంగా ఉంది. ఇది దేశ సగటు (6.73) కంటే అధికం. రాష్ట్ర యంత్రాంగమంతా కరోనా నివారణ చర్యల్లో నిమగ్నమైంది. కేసుల పరంగా మహారాష్ట్ర, కేరళ తర్వాత ఏపీ మూడో పెద్ద రాష్ట్రం. బీహార్, రాజస్థాన్లతో ఏపీని పోల్చిచూడటం సరికాదు’ అని పేర్కొన్నారు.
పార్టీలు, వ్యక్తులు నిపుణులు కాదు..
ఎన్నికల నిర్వహణపై ఏపీ ప్రభుత్వ అభిప్రాయం కోరుతూ ఎన్నికల సంఘం ఆగస్టులో సీఎస్కు లేఖరాయగా.. అక్టోబరులో సీఎస్ ప్రత్యుత్తరమిచ్చారు. సాధారణ పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ప్రభుత్వం తన సంసిద్ధత తెలియజేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికలకు రాజకీయ పార్టీలు సానుకూలంగా ఉన్నాయని ఎన్నికల సంఘం చెప్పడం సరికాదు. పార్టీలు, వాటి ప్రతినిధులు కరోనా చికిత్సలో, నివారణలో నిపుణులు కాదు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేం. ఏపీలో ఇప్పటికే 11,223 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. ఈ అంశాలన్నింటి దృష్ట్యా ఎన్నికల సంఘం చేసిన ప్రకటనను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించండి’ అని ద్వివేది కోరారు.
ఇదీ చదవండి : నేడు ఏపీ - అమూల్ ప్రాజెక్టుకు సీఎం జగన్ శ్రీకారం