ఏపీలో ఆగస్టు 15న పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. పట్టాల రిజిస్ట్రేషన్కు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. 97.83 శాతం ప్లాట్ల విభజన పూర్తయ్యిందని అధికారులు చెబుతున్నారని... మిగతా వాటినీ పూర్తి చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్లాట్ల లబ్ధిదారుల జాబితాలు ఉంచుతున్నారా..? లేదా తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. అర్హత ఉండి దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో పట్టాలు ఇస్తామని చెప్పామని... ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని సీఎం తెలిపారు.
కొవిడ్ పరిస్థితులు తగ్గగానే నేను కూడా రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పర్యటిస్తా. ఇళ్ల పట్టాలకు సంబంధించి 30 లక్షల మందికి రూ. 22,355 కోట్లు ఖర్చు అవుతోంది. రూ.7,700 కోట్ల విలువైన 25,462 ఎకరాల ప్రభుత్వ భూములు, రూ.9,200 కోట్ల విలువైన 23,262 ఎకరాల ప్రైవేటు భూములు, ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన రూ.1350 కోట్ల విలువైన 4,457 ఎకరాల భూములు, రూ. 325 కోట్ల విలువైన 1,074 ఎకరాల సీఆర్డీయే భూములు, రూ. 810 కోట్ల విలువైన 2,686 ఎకరాల టిడ్కో స్థలాలు, పొజిషన్ సర్టిఫికెట్ల ద్వారా రూ. 2,970 కోట్ల విలువైన 9,900 ఎకరాల భూములు.. మొత్తం రూ. 22,355 కోట్ల విలువైన 66,842 ఎకరాల భూములను 30 లక్షల మంది పేద కుటుంబాలకు ఇళ్లపట్టాల రూపంలో ఇవ్వబోతున్నాం.
- ఏపీ సీఎం జగన్
ఇవీచూడండి: ఏ చావైనా.. కొవిడ్ చావుగా భావించడం సరికాదు: మంత్రి ఈటల