మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తీవ్రంగా స్పందించారు. రేవంత్ 'తన ముద్దుల అన్నయ్య' అని అంటూనే ఆయన మాటలు తనను తీవ్రంగా బాధించాయన్నారు. యురేనియంపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల పక్షం సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు చెప్పిన పార్టీ స్టాండ్ తప్పని అభిప్రాయపడ్డారు.
ఆయనకు యురేనియం ఊసెందుకు...
యురేనియంపై సంపత్కు ఏబీసీడీలు తెలియవని రేవంత్రెడ్డి అనడం సరికాదన్నారు. కార్యవర్గ సమావేశంలో తాను ఏం మాట్లాడానో తెలుసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి స్పందించి ఉంటే బాగుండేదన్నారు. రేవంత్లా అవగాహన లేకుండా మాట్లాడే వ్యక్తిని కాదని, ఆధారాలు లేకుండా తానేం మాట్లాడనని అందరికీ తెలుసని చెప్పారు. సంపత్, వంశీలకు యురేనియం సమావేశంలో ఏంపని అని రేవంత్ అన్నారని.. మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్కు యురేనియంపై ఏంపని.. అంటే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
పవన్కల్యాణ్తో సెల్ఫీలా..
గతంలో యురేనియంపై దిల్లీలో అటవీశాఖ డీజీని కలిసి ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు. ఏబీసీడీలు తెలియకుండా యురేనియంపై హస్తిన దాకా పోలేదన్నారు. అసలు అఖిల పక్ష సమావేశానికి రేవంత్రెడ్డికి ఆహ్వానం లేదని.. నాదెండ్ల మనోహర్కు ఫోన్ చేసి అడిగి మరీ రేవంత్రెడ్డి పిలిపించుకున్నారని ఆరోపించాడు. పవన్ కల్యాణ్తో సెల్ఫీ దిగాల్సిన అవసరం లేదన్న సంపత్.. రాష్ట్రవ్యాప్తంగా తనతోనే స్వీయచిత్రాలు దిగేవారు చాలా మంది ఉన్నారన్నారు. పవన్కల్యాణ్కు రేవంత్రెడ్డి.. మూడు కాగితాలు ఇచ్చారేమో.. నేను ఇవ్వాలనుకుంటే ముప్పై కాగితాలున్నాయని పేర్కొన్నారు. అయినా కాంగ్రెస్ ఎంపీగా ఉండి.. పవన్కు నివేదిక ఇవ్వడమేంటని తాను అనడంలో తప్పేంముందని ప్రశ్నించారు.
కాంగ్రెస్లో అవి చెల్లవు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అధిష్ఠానం వద్ద రేవంత్కు వ్యతిరేకంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. హీరో, విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ అన్నీ తానేనని రేవంత్ అనుకుంటారని.. కాంగ్రెస్లో అలాంటివి సాధ్యం కాదని ఎద్దేవా చేశారు.
ఉత్తమ్ పద్మావతే పైనల్..
హుజూర్నగర్ ఉపఎన్నికలో ఉత్తమ్ పద్మావతే తమ అభ్యర్థన్న సంపత్..ఆమెను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తాను పీసీసీ అధ్యక్ష పదవి కావాలని ఎవరినీ అడగలేదని.. కానీ ఏఐసీసీ తన బయోడేటా అడిగినట్లు సంపత్ పేర్కొన్నారు. ఎప్పుడూ రెడ్డి.. బీసీలకే పీసీసీ పదవులిస్తున్నారని.. ఎస్సీలకు కూడా పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కోరారు. దామోదర రాజనర్సింహ పీసీసీకి అన్నివిధాల అర్హుడని అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి: హస్తంలో రాజుకున్న చిచ్చు