టయోటా కిర్లోస్కర్ వైస్-ఛైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ (64) కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం ఆయన గుండెపోటుతో మరణించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయనకు భార్య గీతాంజలి కిర్లోస్కర్, కూతురు మనాసి కిర్లోస్కర్ ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు బెంగళూరులోని హెబ్బల్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విక్రమ్ మెకానికల్ ఇంజినీరింగ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. కిర్లోస్కర్ గ్రూప్లో ఆయన నాలుగో తరానికి చెందినవారు. టయోటా కిర్లోస్కర్ మోటార్కు వైస్-ఛైర్మన్గా వ్యవహరించడంతో పాటు కిర్లోస్కర్ సిస్టమ్స్కు ఎండీ, ఛైర్మన్గానూ బాధ్యతలు నిర్వర్తించారు. సియామ్, సీఐఐ, ఏఆర్ఏఐలో ఆయన పలు కీలక పదవుల్లో పనిచేశారు.