కరోనా భయాలతో సోమవారం భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు నేడు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. అమెరికా కేంద్రీయ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఆర్థిక రంగానికి చేయూత అందిస్తూ.. ప్రభుత్వ బాండ్ల కొనుగోలుపై పరిమితిని ఎత్తేసింది. దీని ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. ఫలితంగా మార్కెట్ ప్రారంభంలో సూచీలు భారీ లాభాల్లో కదలాడాయి. ఒకానొక దశలో 1400 పాయింట్ల లాభంతో దూసుకుపోయిన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. ప్రస్తుతం 300 పాయింట్ల నష్టంతో 25, 712 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 7,531గా కొనసాగుతోంది.
లాభ, నష్టాల్లో...
30 షేర్ల సూచీ సెన్సెక్స్లో ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనిలీవర్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా సహా 11 సంస్థల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
భారతీ ఎయిర్టెల్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ బ్యాంక్, ఐటీసీ సహా 19 సంస్థల షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
స్వల్పంగా బలపడిన రూపాయి..
డాలరు మారకం విలువతో పోలిస్తే రూపాయి విలువ 15 పైసలు బలపడి 76.05 వద్ద కొనసాగుతోంది.
ముడిచమురు..
బ్యారెల్ ముడిచమురు ధర 3 శాతం మేర పెరుగుదలతో 27.83 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: 'ఆర్థిక సంక్షోభం కంటే దారుణ స్థితిని ఎదుర్కోవాలి'