దీపావళి సందర్భంగా ఇవాళ సాయంత్రం 6 గంటల 15 నిమిషాల నుంచి 7 గంటల 15 నిమిషాల వరకు గంటపాటు జరిపిన ప్రత్యేక 'మూరత్ ట్రేడింగ్'లో స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 192 పాయింట్లు లాభంతో 39వేల 250 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 43 పాయింట్ల వృద్ధితో 11వేల 627 వద్ద ట్రేడింగ్ ముగించింది.
ఈ ప్రత్యేక ట్రేడింగ్ను సినీ నటులు రాజ్కుమార్ రావ్, మౌనీ రాయ్లు ప్రారంభించారు.
సంవత్ 2076లోకి ప్రవేశం
నేటి నుంచి స్టాక్మార్కెట్లు సంవత్ 2076లోకి అడుగుపెట్టాయి. ప్రతి ఏటా దీపావళి రోజున ఈ ప్రత్యేక మూరత్ ట్రేడింగ్ను ఎక్స్ఛేంజీలు నిర్వహిస్తాయి. ఈ పురాతన సంప్రదాయాన్ని ప్రతి దీపావళి నాడు ఇవి పాటిస్తూ వస్తున్నాయి. సాధారణ రోజుల్లో జరిగే ట్రేడింగ్ సమయంలో కాకుండా.. మూరత్ ట్రేడింగ్ కోసం శుభఘడియలను ఎంపిక చేసి గంట పాటు ట్రేడింగ్ జరుపుతాయి. లక్ష్మీదేవి కటాక్షం కోసమే ఈ ట్రేడింగ్ సంస్కృతి ప్రారంభమైంది. భారత స్టాక్ మార్కెట్లలో గత 60 ఏళ్లుగా మూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నారు.