కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్రం మరోసారి ఉద్దీపన చర్యలకు ఉపక్రమించింది. వైద్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు, కొవిడ్తో కుదేలైన రంగాలకు అండగా నిలిచేందుకు రూ.1.1 లక్షల కోట్లతో ప్రత్యేక రుణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రకటించారు. ఇందులో అత్యధికంగా వైద్య, ఆరోగ్య రంగానికి రూ.50 వేల కోట్లు, ఇతర రంగాలకు రూ.60 వేల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.
చిన్న సంస్థలకు మరింత అండ..
చిన్న సంస్థలను ఆదుకునేందుకు ఇదివరకే ప్రకటించిన.. ఎమర్జెన్సీ క్రెడిట్ గ్యారంటీ స్కీం (ఈసీజీఎస్) పథకం పరిమితిని రూ.4.5 లక్షల కోట్లకు (అదనంగా 1.5 లక్షల కోట్లు) పెంచుతున్నట్లు వెల్లడించారు సీతారామన్.
ఈసీఎల్జీఎస్లో భాగంగా సూక్ష్మ రుణ సంస్థల ద్వారా 25 లక్షల మందికి రూ.1.25 లక్షల చొప్పున రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ రుణాలపై వడ్డీ గరిష్ఠంగా ఎంసీఎల్ఆర్పై 2 శాతం అధికంగా ఉండనున్నట్లు తెలిపింది. ఈ రుణాల కాలవ్యవధి మూడు సంవత్సరాలని వెల్లడించింది. ఈ పథకం ద్వారా రుణాల మంజూరుకు.. చివరి తేదీ సెప్టెంబర్ 30, రుణాలను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు తుది గడువును డిసెంబర్ 31గా నిర్ణయించింది ఆర్థిక శాఖ.
ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు రుణాలు..
ఈసీఎల్జీఎస్ పథకం ద్వారా ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, మెడికల్ కాలేజీలు.. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు రూ.2 కోట్ల వరకు రుణ హామీ కల్పించింది కేంద్రం. ఈ రుణాలపై వడ్డీ రేటు 7.5 శాతం వద్ద పరిమితం చేసినట్లు పేర్కొంది. ఇంతకంటే తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులకు వెసులుబాటు ఉంది.
మరిన్ని..
- పర్యటక రంగంలో స్థిరపడిన వారికి అండగా నిలిచేందుకు వర్కింగ్ క్యాపిటల్/వ్యక్తిగత రుణాలు.
- రిజిస్టర్ చేసుకున్న టూరిస్ట్ గైడ్లు, పర్యటక రంగంపై ఆధారపడిన 11,000 మందికి ఆర్థిక సాయం.
- తొలి ఐదు లక్షల మంది ఉచిత టూరిస్ట్ వీసాలు. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండనుంది.
- ఆత్మనిర్భర్ రోజ్గార్ యోజన వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగింపు.
- కృత్రిమ ఎరువులకు రూ.14,775 కోట్ల మేర అదనపు రాయితీలు. డీఏపీకి రూ.9,125 కోట్లు, నత్రజనికి రూ.5,650 కోట్లు.
- ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ఎన్ఎఫ్ఎస్ఏ లబ్ధిదారులకు మే నుంచి నవంబర్ వరకు 5 కిలోల ఆహార ధాన్యాలు ఉచితం.
- చిన్నారులు, పిల్లల సంరక్షణ, ఆరోగ్యం కోసం రూ.23,220 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ.
ఇవీ చదవండి: