స్మార్ట్ఫోన్లలో ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే ఫోన్లు అందుబాటులోకి వచ్చాక మొబైల్ డిజైనర్స్ను తీవ్రంగా వేధిస్తున్న సమస్య నాచ్ డిస్ప్లే. ఎంతో ఆకర్షణీయంగా ఉండే డిస్ప్లే పై భాగంలో చిన్న రంధ్రంలో కెమెరాను అమరుస్తారు. దీని వల్ల డిస్ప్లేకు ఉన్న అందం పోతుందని పలువురు స్మార్ట్ఫోన్ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఫొటోలు చూసేప్పుడు ఇబ్బందిగా ఉంటుందని అంటున్నారు. బదులుగా కెమెరా అండర్ డిస్ప్లే లేదా నాచ్లెస్ ఫోన్లు రూపొందించాలని కోరుతున్నారు. వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని మొబైల్ కంపెనీలు నాచ్లెస్ డిస్ప్లే (కెమెరాను డిస్ప్లే కింది భాగంలో ఉంచడం) ఫోన్ల తయారీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
ఇప్పటికే జడ్టీఈ సంస్థ ఆక్సాన్ 20 పేరుతో తొలి నాచ్లెస్ డిస్ప్లే 5జీ ఫోన్ను విడుదల చేసింది. తాజాగా షావోమి కూడా నాచ్లెస్ డిస్ప్లే ఫోన్ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. థర్డ్ జనరేషన్ అండర్ డిస్ప్లే టెక్నాలజీతో దీనిని రూపొందిస్తున్నట్లు షావోమీ తెలిపింది. 2021లో పూర్తి స్థాయిలో ఫోన్ తయారీ ప్రారంభించనుంది. అయితే కెమెరా క్వాలిటీపై టెక్ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షావోమి మాత్రం నాచ్లెస్ డిస్ప్లే ఫోన్లో కూడా క్వాలిటీ కెమెరానే ఇస్తామని ప్రకటించింది.
ఇదీ చూడండి: గూగుల్ సంచలన నిర్ణయం.. ఉద్యోగులకు అదనపు వీక్ ఆఫ్