ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(దక్షిణ కొరియా) మొదటి త్రైమాసికంలో ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్సంగ్ నిర్వహణ లాభాలు 60 శాతం మేర తగ్గాయి.
జనవరి నుంచి మార్చి మధ్య మూడు నెలల కాలంలో నిర్వహణ లాభం 6.2 ట్రిలియన్ వోన్లు గడిచించినట్టు శామ్సంగ్ వెల్లడించింది. అదే కాలంలో 52 ట్రిలియన్ వోన్ల విలువైన ఉత్పత్తుల అమ్మకాలు జరిగినట్లు తెలిపింది. విపణిలో మందగమనం కారణంగా లాభాలు భారీగా తగ్గినట్లు సంస్థ పేర్కొంది. వోన్ అనేది దక్షిణ కొరియా కరెన్సీ. ఒక రూపాయి 16.44 వోన్లకు సమానం.
ఉత్పత్తుల్లో లోపం కారణంగా వాటిని వెనక్కి రప్పించుకోవడం, సంస్థ అధినేతకు జైలు శిక్ష పడటం వంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది శామ్సంగ్. అయినప్పటికీ గతేడాది వరకు రికార్డు స్థాయి లాభాలను నమోదు చేసింది ఈ దిగ్గజ సంస్థ.
అయితే ప్రపంచ వ్యాప్తంగా సరఫరా పెరిగి డిమాండు తగ్గడం వంటి కారణాలతో చిప్ల ధరలు తగ్గి భారీగా నష్టపోయినట్లు పేర్కొంది శామ్సంగ్. యాపిల్ వంటి దిగ్గజ సంస్థలు కూడా తమ ఫోన్ల విడిభాగాలను శాంమ్సంగ్ నుంచే కొనుగోలు చేస్తుండటం గమనార్హం.
శామ్సంగ్ గ్రూపులో ప్రధానమైన భాగస్వామిగా ఉంది శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్. ప్రపంచంలోనే 11వ అతిపెద్ద వ్యాపార దిగ్గజంగా దీనికి పేరుంది. దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వనరుగా శామ్సంగ్ ఉంది.