దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న వేళ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. హరియాణాలోని తమ ఫ్యాక్టరీలన్నింటినీ మూసివేయాలని నిర్ణయించింది. తద్వారా తమ వద్ద ఉన్న ఆక్సిజన్ నిల్వల్ని వైద్య అవసరాల కోసం మళ్లించనున్నట్లు తెలిపింది.
సాధారణంగా నిర్వహణ కార్యకలాపాల నిమిత్తం ప్రతి ఏటా రెండుసార్లు మారుతీ ఫ్యాక్టరీలను కొద్దిరోజుల పాటు మూసివేస్తుంటారు. ఈ క్రమంలో జూన్లో మూసివేయాల్సిన ఫ్యాక్టరీలను ఈసారి కాస్త ముందుగానే క్లోజ్ చేయాలని నిర్ణయించారు. మే 1 నుంచి మే 9 వరకు హరియాణాలోని మారుతీ ఫ్యాక్టరీలన్నీ మూసి ఉంచనున్నారు. తద్వారా తమ ఉద్ద ఉన్న ఆక్సిజన్ నిల్వల్ని ఆస్పత్రులకు తరలించే అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు.
ప్రజల ప్రాణాల్ని రక్షించడంలో ప్రభుత్వానికి తమ సహకారం నిరంతరం కొనసాగుతుందని మారుతీ హామీ ఇచ్చింది. గుజరాత్లోని సుజుకీ మోటార్స్ ఇండియా కూడా ఇదే నిర్ణయం తీసుకుందని మారుతీ తన ప్రకటనలో పేర్కొంది.
ఇదీ చదవండి:'కరోనాపై పోరులో భారత్కు యాపిల్ సాయం'