దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్.. కాలిఫోర్నియా ప్రభుత్వానికి 8లక్షల డాలర్లు(రూ.5.6 కోట్లు) అపరాధ రుసుము చెల్లించేందుకు సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ ఉద్యోగులతో పని చేయించుకోవడం, పన్ను చెల్లింపుల్లో మోసం వంటి ఆరోపణలతో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇన్ఫీ ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్లు తెలిసింది.
అసలు విషయం ఇది...
ఇన్ఫోసిస్కు చెందిన దాదాపు 500 మంది ఉద్యోగులను హెచ్1-బీ (ఉద్యోగ వీసా) వీసాకు బదులు.. బీ-1(బిజినెస్ వీసా) వీసాతో కాలిఫోర్నియా రాష్ట్రంలో పని చేయించుకున్నారనేది ప్రధాన ఆరోపణ. ఈ ఉల్లంఘనతో కాలిఫోర్నియా ప్రభుత్వానికి చెల్లించాల్సిన వేర్వేరు పన్నులను ఇన్ఫీ ఎగ్గొట్టినట్లు అభియోగాలు ఉన్నాయి.
ఈ వ్యవహారంపై ఇన్ఫోసిస్ న్యాయపరమైన విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. అయితే అలాంటి ఇబ్బందులు లేకుండా కాలిఫోర్నియా అటార్నీ జనరల్ జేవియర్ బెసెర్రాతో రాజీ ఒప్పందం కుదుర్చుకుంది ఇన్ఫీ. అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు తోసిపుచ్చుతూనే భారీ మొత్తంలో జరిమానా కట్టేందుకు సిద్ధమైంది. ఇదే విషయాన్ని భారతీయ స్టాక్ మార్కెట్లకు బుధవారం తెలియజేసింది.
ఫెడరల్ అధికారులకు తప్పుడు దస్త్రాలు సమర్పించిన ఆరోపణలతో.. 2017లోనూ న్యూయార్క్ ప్రభుత్వానికి మిలియన్ డాలర్ల అపరాధ రుసుము చెల్లించేందుకు ఇన్ఫోసిస్ అంగీకరించింది.
ఇదీ చూడండి:రెండేళ్లలో మారుమూల గ్రామాలకూ బ్రాడ్బ్యాండ్ సేవలు!