ఏమిటీ వ్యాధి, దీన్ని ఎదుర్కోవడం ఎలా? అని ప్రపంచం అంతా తీవ్రమైన ఆందోళనతో, దిక్కుతోచని స్థితిలో ఉన్న తరుణంలో.. ప్రైవేటు- ప్రభుత్వ భాగస్వామ్యంతో మనదేశ శాస్త్రవేత్తలు, కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే టీకాను ఆవిష్కరించాలనే భగీరథ యత్నానికి శ్రీకారం చుట్టారు. ఈ కసరత్తుకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ముందు నిలవగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెన్నుదన్నుగా నిలిచి అన్ని రకాలుగా మద్దతు ఇచ్చింది.
ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ కుంగిపోక, అనుకున్నది సాధించారు. ఒక్క ఏడాది కాలంలోనే కొవిడ్-19 వ్యాధిని అదుపు చేసే 'కొవాగ్జిన్' టీకాను ఆవిష్కరించి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఘనత చాటిచెప్పారు. టీకా ఆవిష్కరణ ప్రయత్నానికి గత ఏడాది ఏప్రిల్లో తొలి అడుగు పడింది. అక్కడి నుంచి ప్రతి నెలా ఎంతో కొంత ప్రగతి నమోదు చేస్తూ అనుకున్నది సాధించారు.
ఈ కసరత్తు ఎలా ముందుకు సాగిందంటే..
2020
- ఏప్రిల్- ఐసీఎంఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐఏ) నుంచి సార్స్- కోవ్- 2 వైరస్ స్ట్రెయిన్ కోసం భారత్ బయోటెక్ అభ్యర్థన
- మే- పుణె నుంచి హైదరాబాద్లోని భారత్ బయోటెక్ ప్రాంగణానికి సార్స్- కోవ్- 2 వైరస్ స్ట్రెయిన్ చేరిక
- జూన్- టీకాపై ప్రీ-క్లినికల్, టాక్సికాలజీ అధ్యయనాలు మొదలు
- జులై- 'కొవాగ్జిన్' టీకాపై మొదటి, రెండో దశ క్లినికల్ పరీక్షలకు డీసీజీఐ/ సీడీఎస్సీఓ అనుమతి
- సెప్టెంబరు- రెండో దశ క్లినికల్ పరీక్షలు ప్రారంభం
- నవంబరు- 'కొవాగ్జిన్' పై మూడో దశ క్లినికల్ పరీక్షలు భారీస్థాయిలో మొదలు
2021
- జనవరి 3- కొవాగ్జిన్కు అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసిన డీసీజీఐ
- జనవరి 13- దేశవ్యాప్తంగా టీకా పంపిణీ ప్రారంభం
- జనవరి 16- కొవిడ్ పోరాట యోధులకు టీకా
- మార్చి 27- అంతర్జాతీయ శాస్త్ర సాంకేతిక పత్రికల్లో కొవాగ్జిన్పై పరిశోధనా పత్రాల ప్రచురణ
- ఏప్రిల్- జాతీయ టీకాల కార్యక్రమానికి 2 కోట్ల డోసుల టీకా పంపిణీ. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 50 కోట్ల డోసులకు పెంపు