ETV Bharat / business

అగ్రరాజ్యంతో వాణిజ్య ఒప్పందంలో సవాళ్లెన్నో..?

author img

By

Published : Feb 25, 2020, 8:57 AM IST

Updated : Mar 2, 2020, 12:08 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ రెండు రోజుల పర్యటన కోసం భారత్​ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం తొలుత సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు ట్రంప్​. అనంతరం మోటేరాలో భారీ సభ నిర్వహించారు. ఆ తర్వాత తాజ్​మహల్​లో కలియతిరిగారు. నేడు ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు జరగనున్నాయి. అయితే వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో భారత అధికారులు ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమ ఎగుమతులపై సుంకాలు బాగా తగ్గించాలని, రాయితీలు ఇవ్వాలని ట్రంప్ ఒత్తిడి తెచ్చే అవకాశాలు ఉన్నాయి.

trade-situation-between-india-and-america-ahead-of-trumps-visit
భారత్​- అమెరికా వాణిజ్యంపై నేడు చర్చ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల పర్యటనకు భారత్​కు విచ్చేశారు. ఈ పర్యటన దౌత్యపరంగా విశేషమైన పరిణామమే అయినా ఆర్థికంగా మాత్రం కొత్త ఒత్తిళ్లు ఎదురు కానున్నాయి. భారత్‌, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిగితే భారతీయ అధికారులు ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. తమ ఎగుమతులపై సుంకాలు బాగా తగ్గించాలని, రాయితీలు ఇవ్వాలని ట్రంప్‌ ఒత్తిడి తెస్తున్నారు. హార్లే డేవిడ్​సన్‌ మోటారు సైకిళ్లపై భారత్‌ అధిక సుంకాలు విధిస్తోందని ఆయన గతంలో విమర్శించారు. భారత్‌ను టారిఫ్‌ (సుంకాల) రారాజుగా వర్ణించారు. తన పర్యటనలో భారీ రాయితీల కోసం ఆయన డిమాండ్‌ చేయడం ఖాయమని చెప్పొచ్ఛు. వాణిజ్యం, టారిఫ్‌ల మీద కుదుర్చుకున్న సాధారణ ఒప్పందం(గాట్‌)పై సంతకం చేసిన దేశాలు సాటి సభ్య దేశానికి ఏవైనా రాయితీలిస్తే, అవే రాయితీలను మిగిలిన సభ్యులకూ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ట్రంప్‌ ఒత్తిడికి తలొగ్గితే.. అమెరికాకు ఇచ్చే రాయితీలను ఇతరులకూ వర్తింపజేయాల్సి ఉంటుంది.

గాట్​ ఒప్పందం ప్రకారం...

గాట్‌ అనే బహుళపక్ష ఒప్పంద పరిధిలో ద్వైపాక్షిక ఒప్పందాలకు తావు లేదు. దీనికింద ఏ దేశాలకైతే అత్యంత అభిమానపాత్ర దేశాల (ఎంఎఫ్‌ఎన్‌) హోదా ఇచ్చామో వాటన్నింటికీ ఒకే విధంగా రాయితీలివ్వాలని దిల్లీకి చెందిన వాణిజ్య నిపుణుడు అజయ్‌ దువా అభిప్రాయపడ్డారు. పలు దేశాలకు ఎంఎఫ్‌ఎన్‌ హోదా ఇవ్వడం ద్వారా బహుళపక్ష వాణిజ్యాన్ని ప్రోత్సహించాలని గాట్‌ ఉద్దేశిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక ప్రపంచం ఆర్థికంగా చితికిపోయింది. దాన్ని మళ్లీ గాడిలో పెట్టడానికి 1947 అక్టోబరులో 23 దేశాలు గాట్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. తరవాత ఈ దేశాల సంఖ్య 123కు పెరిగింది. 1995లో గాట్‌ వారసత్వం డబ్ల్యూటీఓకు సంక్రమించి 90 శాతం ప్రపంచ వాణిజ్యం ఆ సంస్థ పరిధిలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సంస్థలో 164 సభ్యదేశాలు, 23 పరిశీలక దేశాలు ఉన్నాయి. డబ్ల్యూటీఓ సభ్య దేశాలన్నీ పరస్పరం ఎంఎఫ్‌ఎన్‌ హోదా ఇచ్చుకోవలసిందే.

కాలు దువ్వతోన్న అమెరికా కోడి...

డబ్ల్యూటీఓ వస్తు వ్యాపార మండలి గాట్‌ సంబంధ అంశాలను పర్యవేక్షిస్తుంది. వ్యవసాయం, సబ్సిడీలు, మార్కెట్‌లో ప్రవేశం కల్పించడం వంటి అంశాలపై 10 కీలక బృందాలు ఈ మండలి ఛత్రం కింద పనిచేస్తాయి. భారతదేశానికి ఆపిల్‌, బాదం, అక్రోట్‌, పాల ఎగుమతులను పెంచాలని అమెరికా ఆరాటపడుతోంది. అలాగే తమ దేశంలో గుట్టలుగా పేరుకుపోయిన కోడి కాళ్లనూ మనకు అంటగట్టాలని చూస్తోంది. 2017లో డబ్ల్యూటీఓ ఒత్తిడి వల్ల కోడి కాళ్ల దిగుమతికి భారత్‌ అంగీకరించక తప్పలేదు. పాడి, కోడి కాళ్ల దిగుమతికి గేట్లు ఎత్తితే భారతీయ రైతులు, కోళ్ల పెంపకందారులు విపరీతంగా నష్టపోతారు. ఈ రెండు పరిశ్రమల్లో లక్షలమంది జీవనోపాధికీ ఎసరు వస్తుంది.

మన రైతులకే నష్టం...

ఈ ఏడాది చివర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలని చూస్తున్న ట్రంప్‌ తన పర్యటనలో భారత్‌పై వాణిజ్యపరంగా తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చే అవకాశమే ఎక్కువ. భారతదేశం నుంచి దండిగా వాణిజ్యపరమైన రాయితీలు పొందామని చెప్పుకోవడం ద్వారా అమెరికన్‌ రైతుల ఓట్లను కొల్లగొట్టాలని ట్రంప్‌ లక్షిస్తున్నారు. నిజానికి భారతీయ రైతుల ప్రయోజనాలను సంరక్షించడం కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నవంబరులో సమగ్ర ప్రాంతీయ ఆర్థిక ఒప్పందం (ఆర్‌.సి.ఇ.పి.)పై సంతకం చేయడానికి నిరాకరించారు. ఆర్‌.సి.ఇ.పి.లో చేరితే చైనా నుంచి పారిశ్రామిక ఉత్పత్తులు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల నుంచి పాల ఉత్పత్తులు భారత్‌లోకి వచ్చిపడి మన రైతులను, పరిశ్రమలను దెబ్బతీస్తాయని ఆయన గ్రహించారు. ప్రస్తుత రూపులో ఆర్‌.సి.ఇ.పి.పై సంతకం చేయలేమని స్పష్టం చేశారు. ఆర్‌.సి.ఇ.పి.లో చైనా, జపాన్‌, ఆగ్నేయాసియా దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఆ దేశాల ఒత్తిడికి తలొగ్గకుండా ఆర్‌.సి.ఇ.పి. నుంచి వైదొలగిన కొద్ది నెలల్లోనే అమెరికా ఒత్తిడిని భారత్‌ ఎదుర్కోవలసి వస్తోంది.

రాయితీలు ఇవ్వం కానీ కావాలి..

ట్రంప్‌ భారత్‌ను వర్థమాన దేశాల జాబితా నుంచి తొలగించడం కూడా మనకు భారీ నష్టం కలిగిస్తుంది. భారత్‌ పర్యటనకు వచ్చేముందు, ఈ నెల 10న ట్రంప్‌ ఇచ్చిన ‘బహుమాన’మిది. దీనివల్ల భారత్‌ 26 కోట్ల డాలర్ల (రూ.1,820 కోట్ల) మేరకు రాయితీలను కోల్పోనుంది. ఇది ఒక రకంగా భారత్‌ మీద జరిమానా విధించడమే. ట్రంప్‌ ఒకవైపు భారత్‌కు రాయితీలను ఉపసంహరిస్తూ, మరోవైపు భారత్‌ నుంచి రాయితీలు కోరడం వింత. భారత్‌, చైనాలు ఇంకెంతమాత్రం వర్ధమాన దేశాలు కావంటూ ట్రంప్‌ సార్వత్రిక ప్రాధాన్యతా వ్యవస్థ (జీఎస్పీ) కింద 45 ఏళ్లుగా లభిస్తున్న రాయితీలను ఉపసంహరించారు. అంతకుముందు భారత్‌ నుంచి ఉక్కు, అల్యూమినియం దిగుమతులపైనా రాయితీలను పెంచేశారు.

మిగిలిన దేశాలకూ కూడా...

భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా వర్ణిస్తూ జీఎస్పీ నుంచి తొలగించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. 12,375 డాలర్ల తలసరి ఆదాయం కలిగిన దేశాలనే మాత్రమే అభివృద్ధి చెందినవిగా పరిగణిస్తారు. భారతదేశ తలసరి ఆదాయం 2,016 డాలర్లు. అయినా ట్రంప్‌ భారత్‌ను సంపన్న దేశంగా పరిగణించడం విడ్డూరం. ట్రంప్‌ పర్యటనకు వచ్చినప్పుడు భారత్‌ కనుక సుంకాల్లో అమెరికాకు రాయితీ ఇస్తే, మిగిలిన డబ్ల్యూటీఓ సభ్య దేశాలకూ ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల భారతదేశ వాణిజ్యం దెబ్బతినిపోతుంది. ఈ సవాలును భారత్‌ ఎలా ఎదుర్కొంటుందన్నది కీలక ప్రశ్న.

--- కృష్ణానంద్​ త్రిపాఠి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల పర్యటనకు భారత్​కు విచ్చేశారు. ఈ పర్యటన దౌత్యపరంగా విశేషమైన పరిణామమే అయినా ఆర్థికంగా మాత్రం కొత్త ఒత్తిళ్లు ఎదురు కానున్నాయి. భారత్‌, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిగితే భారతీయ అధికారులు ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. తమ ఎగుమతులపై సుంకాలు బాగా తగ్గించాలని, రాయితీలు ఇవ్వాలని ట్రంప్‌ ఒత్తిడి తెస్తున్నారు. హార్లే డేవిడ్​సన్‌ మోటారు సైకిళ్లపై భారత్‌ అధిక సుంకాలు విధిస్తోందని ఆయన గతంలో విమర్శించారు. భారత్‌ను టారిఫ్‌ (సుంకాల) రారాజుగా వర్ణించారు. తన పర్యటనలో భారీ రాయితీల కోసం ఆయన డిమాండ్‌ చేయడం ఖాయమని చెప్పొచ్ఛు. వాణిజ్యం, టారిఫ్‌ల మీద కుదుర్చుకున్న సాధారణ ఒప్పందం(గాట్‌)పై సంతకం చేసిన దేశాలు సాటి సభ్య దేశానికి ఏవైనా రాయితీలిస్తే, అవే రాయితీలను మిగిలిన సభ్యులకూ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ట్రంప్‌ ఒత్తిడికి తలొగ్గితే.. అమెరికాకు ఇచ్చే రాయితీలను ఇతరులకూ వర్తింపజేయాల్సి ఉంటుంది.

గాట్​ ఒప్పందం ప్రకారం...

గాట్‌ అనే బహుళపక్ష ఒప్పంద పరిధిలో ద్వైపాక్షిక ఒప్పందాలకు తావు లేదు. దీనికింద ఏ దేశాలకైతే అత్యంత అభిమానపాత్ర దేశాల (ఎంఎఫ్‌ఎన్‌) హోదా ఇచ్చామో వాటన్నింటికీ ఒకే విధంగా రాయితీలివ్వాలని దిల్లీకి చెందిన వాణిజ్య నిపుణుడు అజయ్‌ దువా అభిప్రాయపడ్డారు. పలు దేశాలకు ఎంఎఫ్‌ఎన్‌ హోదా ఇవ్వడం ద్వారా బహుళపక్ష వాణిజ్యాన్ని ప్రోత్సహించాలని గాట్‌ ఉద్దేశిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక ప్రపంచం ఆర్థికంగా చితికిపోయింది. దాన్ని మళ్లీ గాడిలో పెట్టడానికి 1947 అక్టోబరులో 23 దేశాలు గాట్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. తరవాత ఈ దేశాల సంఖ్య 123కు పెరిగింది. 1995లో గాట్‌ వారసత్వం డబ్ల్యూటీఓకు సంక్రమించి 90 శాతం ప్రపంచ వాణిజ్యం ఆ సంస్థ పరిధిలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సంస్థలో 164 సభ్యదేశాలు, 23 పరిశీలక దేశాలు ఉన్నాయి. డబ్ల్యూటీఓ సభ్య దేశాలన్నీ పరస్పరం ఎంఎఫ్‌ఎన్‌ హోదా ఇచ్చుకోవలసిందే.

కాలు దువ్వతోన్న అమెరికా కోడి...

డబ్ల్యూటీఓ వస్తు వ్యాపార మండలి గాట్‌ సంబంధ అంశాలను పర్యవేక్షిస్తుంది. వ్యవసాయం, సబ్సిడీలు, మార్కెట్‌లో ప్రవేశం కల్పించడం వంటి అంశాలపై 10 కీలక బృందాలు ఈ మండలి ఛత్రం కింద పనిచేస్తాయి. భారతదేశానికి ఆపిల్‌, బాదం, అక్రోట్‌, పాల ఎగుమతులను పెంచాలని అమెరికా ఆరాటపడుతోంది. అలాగే తమ దేశంలో గుట్టలుగా పేరుకుపోయిన కోడి కాళ్లనూ మనకు అంటగట్టాలని చూస్తోంది. 2017లో డబ్ల్యూటీఓ ఒత్తిడి వల్ల కోడి కాళ్ల దిగుమతికి భారత్‌ అంగీకరించక తప్పలేదు. పాడి, కోడి కాళ్ల దిగుమతికి గేట్లు ఎత్తితే భారతీయ రైతులు, కోళ్ల పెంపకందారులు విపరీతంగా నష్టపోతారు. ఈ రెండు పరిశ్రమల్లో లక్షలమంది జీవనోపాధికీ ఎసరు వస్తుంది.

మన రైతులకే నష్టం...

ఈ ఏడాది చివర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలని చూస్తున్న ట్రంప్‌ తన పర్యటనలో భారత్‌పై వాణిజ్యపరంగా తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చే అవకాశమే ఎక్కువ. భారతదేశం నుంచి దండిగా వాణిజ్యపరమైన రాయితీలు పొందామని చెప్పుకోవడం ద్వారా అమెరికన్‌ రైతుల ఓట్లను కొల్లగొట్టాలని ట్రంప్‌ లక్షిస్తున్నారు. నిజానికి భారతీయ రైతుల ప్రయోజనాలను సంరక్షించడం కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నవంబరులో సమగ్ర ప్రాంతీయ ఆర్థిక ఒప్పందం (ఆర్‌.సి.ఇ.పి.)పై సంతకం చేయడానికి నిరాకరించారు. ఆర్‌.సి.ఇ.పి.లో చేరితే చైనా నుంచి పారిశ్రామిక ఉత్పత్తులు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల నుంచి పాల ఉత్పత్తులు భారత్‌లోకి వచ్చిపడి మన రైతులను, పరిశ్రమలను దెబ్బతీస్తాయని ఆయన గ్రహించారు. ప్రస్తుత రూపులో ఆర్‌.సి.ఇ.పి.పై సంతకం చేయలేమని స్పష్టం చేశారు. ఆర్‌.సి.ఇ.పి.లో చైనా, జపాన్‌, ఆగ్నేయాసియా దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఆ దేశాల ఒత్తిడికి తలొగ్గకుండా ఆర్‌.సి.ఇ.పి. నుంచి వైదొలగిన కొద్ది నెలల్లోనే అమెరికా ఒత్తిడిని భారత్‌ ఎదుర్కోవలసి వస్తోంది.

రాయితీలు ఇవ్వం కానీ కావాలి..

ట్రంప్‌ భారత్‌ను వర్థమాన దేశాల జాబితా నుంచి తొలగించడం కూడా మనకు భారీ నష్టం కలిగిస్తుంది. భారత్‌ పర్యటనకు వచ్చేముందు, ఈ నెల 10న ట్రంప్‌ ఇచ్చిన ‘బహుమాన’మిది. దీనివల్ల భారత్‌ 26 కోట్ల డాలర్ల (రూ.1,820 కోట్ల) మేరకు రాయితీలను కోల్పోనుంది. ఇది ఒక రకంగా భారత్‌ మీద జరిమానా విధించడమే. ట్రంప్‌ ఒకవైపు భారత్‌కు రాయితీలను ఉపసంహరిస్తూ, మరోవైపు భారత్‌ నుంచి రాయితీలు కోరడం వింత. భారత్‌, చైనాలు ఇంకెంతమాత్రం వర్ధమాన దేశాలు కావంటూ ట్రంప్‌ సార్వత్రిక ప్రాధాన్యతా వ్యవస్థ (జీఎస్పీ) కింద 45 ఏళ్లుగా లభిస్తున్న రాయితీలను ఉపసంహరించారు. అంతకుముందు భారత్‌ నుంచి ఉక్కు, అల్యూమినియం దిగుమతులపైనా రాయితీలను పెంచేశారు.

మిగిలిన దేశాలకూ కూడా...

భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా వర్ణిస్తూ జీఎస్పీ నుంచి తొలగించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. 12,375 డాలర్ల తలసరి ఆదాయం కలిగిన దేశాలనే మాత్రమే అభివృద్ధి చెందినవిగా పరిగణిస్తారు. భారతదేశ తలసరి ఆదాయం 2,016 డాలర్లు. అయినా ట్రంప్‌ భారత్‌ను సంపన్న దేశంగా పరిగణించడం విడ్డూరం. ట్రంప్‌ పర్యటనకు వచ్చినప్పుడు భారత్‌ కనుక సుంకాల్లో అమెరికాకు రాయితీ ఇస్తే, మిగిలిన డబ్ల్యూటీఓ సభ్య దేశాలకూ ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల భారతదేశ వాణిజ్యం దెబ్బతినిపోతుంది. ఈ సవాలును భారత్‌ ఎలా ఎదుర్కొంటుందన్నది కీలక ప్రశ్న.

--- కృష్ణానంద్​ త్రిపాఠి

Last Updated : Mar 2, 2020, 12:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.