దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన వినియోగదారులకు శుభవార్త అందించింది. రాబోయే పండగ సీజన్లో తమ వినియోగదారులందరికీ.. మొబైల్ బ్యాంకింగ్ యాప్ యోనో(యూ ఓన్లీ నీడ్ వన్ యాప్) ద్వారా తీసుకునే వ్యక్తిగత, బంగారం, కారు రుణాలపై ప్రాసెసింగ్ రుసుములు వందశాతం మాఫీ సహా.. తన రిటైల్ రుణ గ్రహీతలకు ప్రత్యేక పండగ ఆఫర్లను ప్రకటించింది.
" ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటున్న క్రమంలో వినియోగదారుల వ్యయం పెరుగుతుందనే ఆశిస్తున్నాం. అదే సమయంలో వారి ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఎస్బీఐ సహాయం చేస్తుందని భరోసా ఇస్తున్నాం. కారు, బంగారంపై రుణాల్లో యోనో వినియోగదారులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇంటి వద్ద నుంచి యోనో ద్వారా పేపర్లెస్ వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. "
- సీఎస్ సెట్టి, మేనేజింగ్ డైరెక్టర్(రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్)
- అనుమతి పొందిన ప్రాజెక్టుల్లో ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి గృహ రుణాలపై పూర్తిస్థాయిలో ప్రాసెసింగ్ రుసుమును తొలగించింది. క్రెడిట్ స్కోరు, గృహ రుణ మొత్తం ఆధారంగా వినియోగదారులకు వడ్డీ రేటుపై 10 బేసిస్ పాయింట్లు వరకు రాయితీలు ఇస్తోంది. దీనికి అదనంగా యోనో ద్వారా గృహ రుణాలకు దరఖాస్తు చేసుకుంటే.. మరో 5 బేసిస్ పాయింట్లు రాయితీ లభించనుంది.
- కారు కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి అతితక్కువ వడ్డీ రేటుతో రుణాలు అందిస్తోంది. ఇది 7.5 శాతం నుంచి మొదలవుతోంది. కొన్ని ఎంపిక చేసిన మోడల్స్పై 100 శాతం ఆన్రోడ్ ఫైనాన్స్ అవకాశం కల్పిస్తోంది ఎస్బీఐ.
- ఎస్బీఐ ప్రస్తుతం 7.5 శాతం వడ్డీకి బంగారంపై రుణాలు అందిస్తోంది. 36 నెలల పాటు తిరిగి చెల్లించేందుకు వీలుకల్పిస్తోంది.
- వ్యక్తిగత రుణాలను 9.6 శాతం వడ్డీ రేటుకు అందిస్తోంది.
ఇదీ చూడండి: రిఫ్రిజిరేటర్లకు పండగ సీజన్ అయినా కలిసొచ్చేనా!