SBI Mutual Fund IPO: స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన మ్యూచువల్ ఫండ్ సంయుక్త సంస్థను కూడా స్టాక్ మార్కెట్లో నమోదు చేసే దిశగా మరో ముందడుగు వేసింది. ఐపీఓ ప్రతిపాదనకు తాజాగా బోర్డు ఆమోదం లభించింది. దీంతో ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్(ఎస్బీఐఎఫ్ఎంపీఎల్)లో ఉన్న 6 శాతం వాటాను ఎస్బీఐ ఐపీఓ ద్వారా విక్రయించడం లాంఛనమైంది.
జీవితబీమా, ఎస్బీఐ కార్డ్స్ వ్యాపారాల్ని గత ఏడాది నమోదు చేయడం వల్ల ఎస్బీఐ అధిక విలువను పొందిందని, ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్ సంస్థను కూడా నమోదు చేస్తే మంచిదనే అభిప్రాయంలో ఎస్బీఐ ఉన్నట్లు సమాచారం. ఎస్బీఐ, అమండి అసెట్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసిన సంయుక్త సంస్థే ఎస్బీఐఎఫ్ఎంపీఎల్. అయితే, తాజా ఐపీఓలో అమండి కూడా తన వాటాలను ఏమైనా విక్రయిస్తుందా? అనే విషయాన్ని ఎస్బీఐ వెల్లడించలేదు.
ఈ ఐపీఓ ద్వారా సుమారు 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.7,500 కోట్లు) సమీకరించాలని ఎస్బీఐ భావిస్తోంది. ఎస్బీఐ మ్యూచువల్ఫండ్ విలువ ప్రస్తుతం 700 కోట్ల డాలర్లుగా ఉందని వివరించింది. భారత్లో ఈ రంగంలో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ సంస్థే అతి పెద్దది. సుమారు రూ.5 లక్షల కోట్ల (6,840 కోట్ల డాలర్లు) ఆస్తుల్ని (ఏయూఎం) ఇది నిర్వహిస్తోంది.
2020 ఏప్రిల్-డిసెంబరు మధ్య ఈ ఫండ్ సంస్థ రూ.498 కోట్ల లాభాన్ని ప్రకటించింది. మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలో ఎస్బీఐకి 63 శాతం వాటా ఉండగా, మిగతా 37 శాతం వాటా పారిస్కు చెందిన అమండి సంస్థ చేతిలో ఉంది.
ఇదీ చూడండి: Google Employees: గూగుల్ సంచలన నిర్ణయం- ఆ రూల్స్ పాటించకపోతే..