దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ అన్ని రకాల పొదుపు ఖాతాలపై 0.25 శాతం మేర వడ్డీరేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీనితో పొదుపు వార్షిక వడ్డీరేటు ప్రస్తుతం ఉన్న 3 శాతం నుంచి 2.75 శాతానికి దిగిరానుంది. ఈ కొత్త వడ్డీరేట్లు 2020 ఏప్రిల్ 15 నుంచి అమలు అవుతాయని ఎస్బీఐ స్పష్టం చేసింది.
వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెరిగిన దృష్ట్యా సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు తెలిపింది ఎస్బీఐ.
ఎంసీఎల్ఆర్ భారీ తగ్గింపు
ఎస్బీఐ నేడు ఎంసీఎల్ఆర్నూ 0.35 శాతం తగ్గించింది. దీనితో ఇంటి రుణాలు, ఇతర రుణాల వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.
వార్షిక ఎంసీఎల్ఆర్ 7.75 శాతం నుంచి 7.40 శాతానికి తగ్గుతుందని, ఇది 2020 ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తుందని ఎస్బీఐ స్పష్టం చేసింది. దీనితో 2019-20 సంవత్సరంలో ఎంసీఎల్ఆర్లో వరుసగా 11వ సారి కోత విధించినట్లైందని ఎస్బీఐ పేర్కొంది.
అర్హత గల గృహ రుణగ్రహీతలకు.... వడ్డీ మొత్తం రూ.లక్షకు సుమారు రూ.24 వరకు తగ్గనున్నట్లు ఎస్బీఐ తెలిపింది. కొత్తగా రుణాలు తీసుకునేవారికి ఇది శుభవార్త.
ఇదీ చూడండి: దేశంలో భారీగా తగ్గిన నియామకాలు.. కారణం ఇదే