ఫిన్టెక్ దిగ్గజం, ప్రముఖ పేమెంట్ సంస్థ పేటీఎం(Paytm).. తమ వినియోగదారులకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది. 'బై నౌ పే లేటర్(బీఎన్పీఎల్)' సేవల్లో భాగంగా 'పోస్ట్పెయిడ్ మినీ'(Paytm postpaid mini) పేరుతో కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా నెలవారీ ఇంటి ఖర్చుల కోసం.. ఇన్స్టంట్ లోన్ సౌకర్యం లభించనుంది. ఈ సేవలను బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ప్రారంభించింది పేటీఎం. ప్రస్తుతం ఉన్న వ్యక్తిగత ఇన్స్టంట్ క్రెడిట్ 'పేటీఎం పోస్ట్పెయిడ్'కు ఇది అదనం.
కొత్త ఆఫర్ ఇలా..
ఈ కొత్త సేవల ద్వారా పేటీఎం వినియోగదారులు రూ.250 నుంచి రూ.1000 వరకు నెలనెలా రుణం పొందేందుకు వీలు కలుగుతుంది. ఈ ఆఫర్ రోజువారీ ఖర్చులతో పాటు మొబైల్, డీటీహెచ్ రీఛార్జులు, గ్యాస్ సిలిండర్ బుకింగ్, విద్యుత్తు, నీటి బిల్లుల వంటి నెలవారీ ఖర్చులకు ఎంతగానో ఉపయోగపడతుందని పేటీఎం పేర్కొంది.
ఈ కొత్త ఫీచర్ ద్వారా రుణాలు పొందితే 30 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల రోజుల కాలానికి ఎలాంటి వడ్డీ ఉండదు. అలాగే.. ఎలాంటి యాక్టివేషన్ ఛార్జీలు, వార్షిక ఫీజులు, కనీస నగదు నిల్వ కూడా అవసరం లేదని స్పష్టం చేసింది పేటీఎం.
ఆర్థిక క్రమశిక్షణను దోహదం..
కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చిన క్రమంలో తమ సంస్థ నిర్ణయంపై కీలక వ్యాఖ్యలు చేశారు పేటీఎం సీఈఓ భవేశ్ గుప్తా. 'ప్రజలు వారి క్రెడిట్ ప్రయాణాన్ని ప్రారంభించటానికి, ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించటానికి మేము సహాయం చేయలనుకుంటున్నాం. పోస్ట్పెయిడ్ ద్వారా మేము ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని పెంచటానికి ప్రయత్నాలు చేపట్టాం. మా కొత్త పోస్ట్పెయిడ్ మినీ సర్వీస్ వినియోగదారులు వారి బిల్లులను సకాలంలో చెల్లించటం, వారి నగదును నిర్వహించడానికి సాయపడుతుంది.' అని పేర్కొన్నారు.
పేటీఎం 2.3 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణ కోసం పబ్లిక్ ఇష్యూకు వెళుతున్న క్రమంలో ఈ మార్పులు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్ ఇష్యూకు రానుంది పేటీఎం. అది నవంబర్లో అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: పేటీఎంలో క్యాష్బ్యాక్ల బొనాంజా- ఇలా చేస్తేనే...