ఆసియాలో ముడిచమురు ధరలు భారీగా పతనమయ్యాయి. కరోనా సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతుండటం, చమురు ఉత్పత్తి సంస్థల మధ్య ధరల యుద్ధం కొసాగుతుండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది.
అమెరికా బెంచ్మార్క్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ సూచీ 5.3 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర ఇక్కడ 20 డాలర్లకు చేరింది. బ్రెంట్ సూచీ నేడు ఏకంగా 6.5 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర ప్రస్తుతం 23 డాలర్లకు పతనమైంది.
చమురుకు కరోనా..
ఐరోపా, అమెరికాపై కరోనా ప్రభావం అధికంగా ఉంది. వీటికి తోడు ఈ సంక్షోభానికి అంతం ఎప్పుడు అనే భయాలు చమురు ధరల పతనానికి కారణమవుతున్నాయి.
దేశంలో కరోనా కారణంగా లక్ష నుంచి రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది అని సీనియర్ అమెరికన్ శాస్త్రవేత్త ఫౌసీ అంచనా వేశారు. అధ్యక్షుడు ట్రంప్ కుడా "సామాజిక దూరం" మార్గదర్శకాలను ఏప్రిల్ 30 వరకు పొడగించారు. ఇంతకు ముందు ఏప్రిల్ మధ్యలోనే దేశం కోలుకుంటుందన్న ఆయన ప్రకటనను వెనక్కి తీసుకుని తాజాగా ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన అమెరికాలో లక్షా 40 వేల మందికిపైగా కరోనా సోకింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి ఇక్కడ 2,400 మందిని బలిగొంది.
పడిపోయిన డిమాండ్..
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్డౌన్ అమలు చేశాయి. రవాణాపై ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో చమురుకు డిమాండ్ తగ్గి.. గత కొన్ని వారాల నుంచి ధరలు పతనమవుతూ వస్తున్నాయి.
డిమాండు తగ్గినప్పటికీ సరఫరా మాత్రం భారీగా పెరిగింది. అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశాలైన సౌదీ అరేబియా, రష్యా ప్రస్తుత డిమాండుకు తగ్గట్లు సరఫరా తగ్గించాలన్న ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు ఉత్పతి పెంచుతుండటం ధరలు రికార్డు స్థాయిలో తగ్గేందుకు కారణమవుతున్నాయి.
మరోవైపు చమురు ధరల నియంత్రణకు రష్యాతో మళ్లీ చర్చలు జరపలేదని సౌదీ స్పష్టం చేసింది. ఈ కారణాలన్నీ చమురు ధరలకు ప్రతికూలంగా మారాయి.
త్వరగా స్పందించకుంటే అంతే...
"డిమాండ్ తగ్గింది అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే నిజానికి సౌదీ అరేబియా, రష్యా అవలంబిస్తున్న మార్గాలు చమురు మార్కెట్ల పతనానికి కారణం అవుతున్నాయి."
-వివేక్ దార్, కమొడిటీ విశ్లేషకులు, కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా
'ఇప్పటికే చాలా దేశాల వద్ద చమురు నిల్వలు భారీగా ఉన్నాయి. ఇంకొన్ని రోజుల్లో ఆయా దేశాల వద్ద చమురు నిల్వలు పూర్తిగా నిండుకుంటాయి. ఈ లోపే చమురు ఉత్పత్తి సంస్థలు స్పందించాలి. లేదంటే చమురు ధరలు మరింత భారీ పతనాన్ని నమోదు చేసే అవకాశాలున్నాయి' అని విశ్లేషకులు స్టీఫెన్ ఇన్నీస్ హెచ్చరించారు.
ఇదీ చూడండి:కరోనా పంజా: ఆర్థిక మాంద్యానికి మందేది?