లక్ష్మీ విలాస్ బ్యాంక్ శాఖలు మొత్తం శుక్రవారం నుంచి సింగపూర్కు చెందిన డీబీఎస్ బ్యాంక్ భారతీయ విభాగాల కిందకు వచ్చాయి. ఫలితంగా ఈ బ్యాంక్పై ఆర్బీఐ ఈ నెల మొదట్లో విధించిన ఆంక్షలు తొలగిపోయాయి. ఇప్పుడు రూ.25,000 కంటే ఎక్కువ విత్డ్రా చేసుకోవచ్చు.
"లక్ష్మీవిలాస్ బ్యాంక్ డిపాజిటర్లు, వినియోగదారులు ఇక నుంచి డీబీఎస్ బ్యాంక్ వినియోగదారులగా తమ ఖాతాలను నిర్వహించుకోవచ్చు. ఇది నవంబర్ 27నుంచి అమల్లోకి వస్తుంది. దీంతో ఆర్బీఐ విధించిన మారటోరియం నిలిచిపోతుంది. డీబీఎస్ బ్యాంక్ ఇక నుంచి లక్ష్మీ విలాస్ బ్యాంక్ కస్టమర్లకు సేవలు అందిస్తుంది." అని ఎల్వీబీ రెగ్యులేటరీకి చేసిన ఫైలింగ్లో పేర్కొంది.
డిపాజిటర్లకు, ఉద్యోగులకు రక్షణ
లక్ష్మీ విలాస్ బ్యాంకు(ఎల్వీబీ)ను డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్(డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-డీబీఐఎల్)లో విలీనం చేయడానికి బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. డిపాజిట్ల ఉపసంహరణలపై ఇక ఎటువంటి ఆంక్షలు ఉండవని ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల ఎల్వీబీలోని 20లక్షల మంది ఖాతాదార్లకు చెందిన రూ.20 వేల కోట్ల డిపాజిట్లతో పాటు 4వేల మంది ఉద్యోగులందరికీ రక్షణ లభిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు, వేతనాలు ఈనెల 17నాటి లాగే ఉంటాయి.
ఇదీ చదవండి: 'వైరస్లను నిరోధించే రంగులకు గిరాకీ'