గత కొంతకాలంగా బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) వడ్డీ రేట్లు అత్యల్ప స్థాయికి చేరాయి. దీంతో సురక్షిత పెట్టుబడి, రాబడి హామీ ఉండే పథకాల్లో పెట్టుబడులు కొనసాగించాలనుకునే వారికి తీవ్ర నిరాశ ఎదురవుతోంది. ముఖ్యంగా కొవిడ్-19 తర్వాత ఆర్బీఐ రుణాల వడ్డీ రేట్లను తగ్గించడంతోపాటు, నిలకడగా కొనసాగిస్తుండటంతో ఎఫ్డీలపైనా ఆ ప్రభావం పడింది. అయితే, ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఒకటి రెండు బ్యాంకులు తమ డిపాజిట్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. రానున్న రోజుల్లో ఇతర బ్యాంకులూ ఈ దారిలో పయనించే అవకాశం ఉంది.
ద్రవ్యోల్బణం పెరుగుతోంది. మరోవైపు రిటైల్ రుణాలకు గిరాకీ అధికమవుతోంది. బ్యాంకు కాలావధి డిపాజిట్లపై వడ్డీ రేట్లు తక్కువగా ఉండటంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులకు డిపాజిట్ల రాక తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో సంప్రదాయ డిపాజిటర్లను ఆకర్షించేందుకు బ్యాంకులు, బ్యాంకింగేతర రుణ సంస్థలు తమ డిపాజిట్ రేట్లను పెంచేందుకు సిద్ధం అవుతున్నాయి.
రెండు దశాబ్దాల తర్వాత..
భారతీయ బ్యాంకింగ్ రంగంలో అతి తక్కువ వడ్డీ రేట్లు ఉండటం రెండు దశాబ్దాల కాలం తర్వాతే చూస్తున్నాం. దాదాపుగా అక్టోబరు 2018 నుంచి తగ్గుతున్న డిపాజిట్ వడ్డీ రేట్లు ఇప్పుడు.. 5.40% దరిదాపుల్లో ఉన్నాయి. వయో వృద్ధుల(సీనియర్ సిటిజన్లు)కు ఎస్బీఐ 5-10 ఏళ్ల వ్యవధి డిపాజిట్లపై 6.20 శాతం చెల్లిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి తర్వాత కొన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు డిపాజిట్ రేట్లను 0.25 శాతం నుంచి 0.50 శాతం వరకూ పెంచాయి. ఈ ధోరణి కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
10.25 శాతం వరకూ..
ఒక వైపు ఎఫ్డీ రేట్లు అత్యల్ప స్థాయిలో కొనసాగుతుండగా.. ఇటీవల కొన్ని ఎన్బీఎఫ్సీలు తమ వ్యాపార అవసరాల కోసం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్సీడీ)ను మార్కెట్లోకి విడుదల చేశాయి. వివిధ వ్యవధులకు 9 శాతం నుంచి 10.25 శాతం వరకూ వడ్డీనిస్తామని ప్రకటించాయి. ఇందులో కాస్త నష్టభయం ఉన్నప్పటికీ.. చాలామంది అధిక ప్రతిఫలం వస్తుండటంతో చాలామంది వీటివైపు మొగ్గు చూపిస్తున్నారని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
రిజర్వు బ్యాంకు ఏం అంటుందో..
రేపటి నుంచి ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష జరగబోతోంది. 7న విధాన ప్రకటన ఉంటుంది. ఈ నేపథ్యంలో పలు అంశాలపై ఆసక్తి నెలకొంది. గత ఏడాది మే నుంచి రెపో రేటును 4 శాతం దగ్గర కొనసాగిస్తోంది. ప్రస్తుతం బ్యాంకులు ఇస్తున్న అప్పులపై రెపో ఆధారిత వడ్డీ రేటును వసూలు చేస్తుండటంతో రిటైల్ రుణాలు తక్కువ వడ్డీకే లభిస్తున్నాయి. ఆర్బీఐ ఈసారీ రెపో రేటును యథాతథంగా ఉంచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇది జరిగితే.. డిపాజిటర్లకు నిరాశ తప్పదు. మరోవైపు ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి చిన్న మొత్తాలపైన వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకొని, వెంటనే ఉపసంహరించుకుంది. భవిష్యత్తులో ఇది ఎలా ఉంటుందో అనే ఆందళన ప్రస్తుతం డిపాజిటర్లలో నెలకొంది. వీటన్నింటికీ సమాధానం బుధవారం దొరకనుంది.
ఇదీ చూడండి: సిప్ టాప్-అప్తో మరింత రాబడి