US Stocks From India: యాపిల్, అమెజాన్, గూగుల్ వంటి అమెరికా దిగ్గజ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ ఇటీవల శుభవార్త చెప్పింది. ఎంపిక చేసిన అమెరికా షేర్లలో భారత రిటైల్ మదుపర్లు పెట్టుబడులు పెట్టే సౌలభ్యాన్ని ఎన్ఎస్ఈ అనుబంధ సంస్థ ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ తీసుకొచ్చింది. అమెరికా షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు మార్గాలు వెతుకుతున్న మదుపర్లలో ఇది గొప్ప ఆసక్తిని సృష్టించింది. ఇప్పటివరకు గుజరాత్లోని గిఫ్ట్ సిటీ నుంచి పనిచేస్తున్న స్టాక్ ఎక్స్ఛేంజీలు భారత షేర్లు, డెరివేటివ్స్లో సులభంగా ట్రేడింగ్ చేసే సౌలభ్యాన్ని ఎన్ఆర్ఐలు, విదేశీయులకు కల్పిస్తున్నాయి. తాజాగా భారత మదుపర్లకు విదేశీ షేర్లలో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని అందిస్తున్నాయి. ఈ పరిణామం నేపథ్యంలో ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ ప్లాట్ఫామ్ జెరోధా అమెరికా షేర్లలో ఎలా పెట్టుబడులు పెట్టాలన్న అంశాన్ని తమ బ్లాగ్లో వివరించింది. ఆ వివరాలు ఇలా..
ప్రస్తుతం అమెరికా షేర్లలో పెట్టుబడులు నియంత్రణపరమైన శాండ్బాక్స్ (పరీక్ష) దశలో ఉన్నాయి. అంటే ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ పరిమిత సంఖ్యలో మదుపర్లకే ఈ అవకాశం అందిస్తుంది. ఐఎఫ్ఎస్సీఏ తుది అనుమతి వచ్చాకే మరింత మంది ఖాతాదారులను అనుమతిస్తారు.
- ట్రేడింగ్ను భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి రాత్రి 2.30 గంటల వరకు అనుమతిస్తారు. కొన్ని అమెరికా షేర్ల విలువ వందల నుంచి వేల డాలర్ల మధ్య ఉండటంతో.. 10, 20 డాలర్ల నామినేషన్లలో మాత్రమే అనుమతి ఉంటుంది.
- అమెరికా షేర్లలో ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్, హోల్డింగ్ వంటివి ఐఎఫ్ఎస్సీ నియంత్రణ విధానానికి లోబడి ఉంటుంది. భారత మదుపర్లకు అన్స్పాన్సర్డ్ డిపాజిటరీ రీసిట్స్ రూపంలో పెట్టుబడులు ఉంటాయి.
- గిఫ్ట్ సిటీలో తెరిచిన డీమ్యాట్ ఖాతాల్లో మదుపర్లు డిపాజిటరీ రీసిట్స్ను అట్టిపెట్టుకోవచ్చు. ఆయా షేర్ల కార్పొరేట్ నిర్ణయాల ప్రయోజనాలను కూడా పొందొచ్చు.
- ఒక దేశంలోని ఎక్స్ఛేంజీల్లో నమోదైన కంపెనీ.. మరో దేశంలో మదుపర్లను ఆకట్టుకునేందుకు డిపాజిటరీ రీసిట్స్ (డీఆర్లు) ఎంచుకుంటాయి. కంపెనీ డీఆర్ను ఆఫర్ చేస్తే.. వాటిని స్పాన్సర్డ్ డీఆర్ అంటారు. కంపెనీ ప్రమేయం లేకుంటే అన్స్పాన్సర్డ్ డీఆర్గా పరిగణిస్తారు. అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీల్లో స్పాన్సర్డ్ డీఆర్ల ద్వారా ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో వంటి కంపెనీల షేర్లు ట్రేడవుతున్నాయి.
- అమెరికా షేర్ల పెట్టుబడులకు టీ+3 రోజుల సెటిల్మెంట్ విధానం అమలవుతుంది. అంటే షేర్లు లేదా డీఆర్లు కొనుగోలు చేసిన 3 రోజుల్లో డీమ్యాట్ ఖాతాలో జమవుతాయి. భారత్లో ఇది 2 రోజులుగా ఉంది. ఇదే విధంగా షేర్లు విక్రయించిన తర్వాత సొమ్ము జమకావడానికి 3 రోజులు పడుతుంది. సెటిల్మెంట్ పూర్తయ్యే వరకు ఇతర లావాదేవీలకు అనుమతించరు.
- ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీపై లావాదేవీలకు బ్రోకరేజీ సంస్థలతో పాటు ఎక్స్ఛేంజీ సైతం ఛార్జీలు వసూలు చేస్తుంది. ప్రతి 100 డాలర్లకు ఎక్స్ఛేంజీ 12 సెంట్లు వసూలు చేయనుంది.
- ఇందులో సభ్యత్వం పొందే ప్రక్రియలో జెరోధా ఉంది. భారత ఎక్స్ఛేంజీలు, సెబీ నుంచి తప్పనిసరి అనుమతులు వచ్చిన తర్వాత కొన్ని నెలల్లో సేవలు అందించనుంది.
ఇదీ చదవండి: పీఎఫ్పై వడ్డీరేటు తగ్గింపు.. 4 దశాబ్దాల కనిష్ఠానికి..