జీవీకే గ్రూపునకు చెందిన ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు అదానీ గ్రూపు చేతికి వెళ్లిపోనుందని ప్రచారం సాగుతోంది. ఈ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న ఎంఐఏఎల్ (ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్)లో జీవీకే గ్రూపునకు ఉన్న వాటాను కొనుగోలు చేయటానికి అదానీ గ్రూపు సంప్రదింపులు సాగిస్తున్నట్లు తెలిసింది.
ఎంఐఏఎల్లో ప్రస్తుతం జీవీకేకు 50.5% వాటా, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కు 26 శాతం వాటా ఉన్నాయి. ఎయిర్పోర్ట్స్ కంపెనీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, బిడ్వెస్ట్ గ్రూపు చేతిలో మిగిలిన వాటా ఉంది. గతేడాది మార్చిలో బిడ్వెస్ట్ గ్రూపు వాటా కొనుగోలు చేయటానికి అదానీ గ్రూపు ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నాన్ని జీవీకే గ్రూపు అడ్డుకుంది. ఆ వాటా తానే కొనుగోలు చేస్తానని స్పష్టం చేసింది. కానీ అందుకు అవసరమైన సొమ్ము సమకూర్చులేకపోయింది. ఆ తర్వాత ఈ వ్యవహారం న్యాయస్థానం వరకూ వెళ్లింది.
ఆ స్థానంలో అదానీ.!
మరోవైపు ఎంఐఏఎల్ నుంచి తన ఇతర కంపెనీల్లోకి జీవీకే గ్రూపు రూ.705 కోట్ల మేరకు నిధులు మళ్లించినట్లు ఆరోపిస్తూ సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో ఎంఐఏఎల్ నుంచి జీవీకే గ్రూపు వైదొలగదల్చుకున్నట్లు, ఆ స్థానంలో అదానీ గ్రూపు రాబోతోందని చెబుతున్నారు.
అదానీ గ్రూపు గత కొంతకాలంగా విమానాశ్రయాల వ్యాపార విభాగంలోకి విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఇటీవల ఆరు నాన్-మెట్రో విమానాశ్రయాల నిర్మాణ- నిర్వహణ కాంట్రాక్టులను అదానీ గ్రూపు దక్కించుకుంది. ఇప్పుడు దేశంలోని రెండో అతి పెద్దదైన ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సొంతం చేసుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే జీవీకే- అదానీ గ్రూపు మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: టిక్టాక్ బ్యాన్ వెనుక ఫేస్బుక్ 'మార్క్'!